విజ్ఞాన్స్‌ యూనివర్సిటీకు జాతీయ స్థాయి పేటెంట్‌

విజ్ఞాన్స్‌ యూనివర్సిటీకు జాతీయ స్థాయి పేటెంట్‌
టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్:
చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్స్‌ యూనివర్సిటీకు జాతీయస్థాయి పేటెంట్‌ మంజూరయ్యిందని వర్సిటీ వైస్‌ చాన్స్‌లర్‌ ప్రొఫెసర్‌ పీ.నాగభూషణం గురువారం తెలిపారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ విజ్ఞాన్స్‌ యూనివర్సిటీ బయోటెక్నాలజీ విభాగానికి చెందిన అధ్యాపకులు డాక్టర్‌ ఎన్‌.ఎస్‌.సంపత్‌ కుమార్, డాక్టర్‌ దిరిశాల విజయరాము, ముగ్గురు విద్యార్థులు సంయుక్తంగా ప్రతిపాదించిన ‘‘ యాన్‌ ఎడిబుల్‌ ప్లేవర్‌ ఎన్‌హ్యాన్స్‌ ఫ్రమ్‌ పెరిగోప్తలిస్‌ పార్దాలిస్‌’’ అనే అంశానికి ప్రముఖ ఇంటెలెక్చువల్‌ ప్రాపర్టీ ఇండియా అథారిటీ పేటెంట్‌ను మంజూరు చేస్తున్నట్లు ప్రకటించిందన్నారు. వీరు ప్రతిపాదించిన ఈ పేటెంట్‌కు 20 సంవత్సరాల పాటు హక్కులు ఉంటాయని పేర్కొన్నారు. ఈ పేటెంట్‌ ప్రతిపాదనలో బయోటెక్‌ విద్యార్థులైన కే.మృదులా చౌదరి, టీ.సతీష్‌ కుమార్, జే.జాస్మిన్‌ రెడ్డి  ముఖ్య భూమిక పోషించారని తెలిపారు.  పెరిగోప్తలిస్‌ అనే చేప కొల్లేరు సరస్సుల్లో విరివిగా లభిస్తూ మిగిలిన అన్ని చేపలకు హానికలగచేస్తూ పర్యావరణ అసమతుల్యానికి కారణమవుతున్న తరుణంలో ఈ ఇద్దరు అధ్యాపకులు, బయోటెక్నాలజీ విద్యార్థులు కలిసి ఈ సమస్యను విశ్లేషించారు. ఈ చేప నుంచి పోషక విలువలు కలిగిన పొడిని బయోటెక్‌ పద్దతిలో రూపొందించి తినుబండారాల తయారీలో వీటిని ఉపయోగించవచ్చునని కనుగొన్నారు. మిక్కిలి ఇష్టముగా తీసుకునే తినుబండారాలలో ఉండుట వలన పిల్లల్లో పోషక విలువలు పెరుగుటకు అంతర్లీనంగా ఈ పొడి దోహదపడుతుందని వెల్లడించారు. జాతీయ స్థాయి పేటెంట్‌ పొందిన అధ్యాపకులు డాక్టర్‌ ఎన్‌.ఎస్‌.సంపత్‌ కుమార్, డాక్టర్‌ దిరిశాల విజయరాములను విజ్ఞాన్స్‌ విద్యాసంస్థల చైర్మన్‌ డాక్టర్‌ లావు రత్తయ్య, వైస్‌ చాన్స్‌లర్‌ ప్రొఫెసర్‌ పీ.నాగభూషణ్‌ ప్రత్యేకంగా అభినందించారు.