కొత్త ఐడియాలతోనే జీవితంలో మార్పు
విజయవాడలోని ఎస్టీపీఐ జాయింట్ డైరక్టర్ బీ.వినయ్ కుమార్
విజ్ఞాన్స్లో ఘనంగా వీఐఐఐఎస్ఏ టీబీఐ స్టార్టప్ ఫండింగ్ సదస్సు
సదస్సుకు 12 రాష్ట్రాల నుంచి హాజరైన 30 స్టార్టప్ కంపెనీలు
టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్:
జీవితంలో ఎవరైనా మార్పుతో పాటు అభివృద్ధి చెందాలనుకుంటే కొత్త ఐడియాలతోనే సాధ్యమని విజయవాడలోని ఎస్టీపీఐ జాయింట్ డైరక్టర్ బీ.వినయ్ కుమార్ అన్నారు. చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్స్ యూనివర్సిటీలోని టెక్నాలజీ బిజినెస్ ఇంకుబేటర్ వారు న్యూఢిల్లీలోని డీఎస్టీ ఆర్థిక సహాయంతో ‘‘ వీఐఐఐఎస్ఏ (విజ్ఞాన్స్ ఇన్నోవేషన్, ఇగ్నిషన్ అండ్ ఇంకుబేషన్ ఫర్ స్టార్టప్ యాక్సిలరేషన్) టెక్నాలజీ బిజినెస్ ఇంకుబేటర్ స్టార్టప్ ఫండింగ్ ఏంజెల్ ఇన్వెస్టర్స్ అండ్ వెంచర్ క్యాపటలిస్ట్స్) సదస్సు కార్యక్రమాన్ని శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ సదస్సుకు 12 రాష్ట్రాల నుంచి ఎంపికచేసిన 30 స్టార్టప్ కంపెనీలు హాజరయ్యాయి. ఈ 30 కంపెనీలు ప్రారంభించాలనుకుంటున్న వివిధ రకాల స్టార్టప్ కంపెనీల ఐడియాలను ఈ సదస్సులో తెలియజేసారు. ఉత్తమంగా ఉన్న స్టార్టప్ కంపెనీల ఐడియాలకు విజ్ఞాన్స్ టీబీఐ ఆర్థికంగా తోడ్పాటునందించనుంది. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన విజయవాడలోని ఎస్టీపీఐ జాయింట్ డైరక్టర్ బీ.వినయ్ కుమార్ మాట్లాడుతూ సరికొత్త ఆవిష్కరణలతో ముందుకు వచ్చే వారికి ఎల్లప్పుడు ఆర్థిక తోడ్పాటును అందించడానికి సిద్ధంగా ఉన్నామన్నారు. ఎవరికైనా కొత్త ఐడియాలు ఉన్నట్లైతే వాటిని వెంటనే అభివృద్ధి చేసి మార్కెట్లోకి విడుదల చేయాలన్నారు. దేశంలో వివిధ రకాల ఎంటర్ప్రెన్యూర్స్ను స్థాపిస్తేనే దేశంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలకు పరిష్కారం చూపవచ్చన్నారు. ప్రతి ఒక్కరూ ఎప్పటికప్పుడు మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా టెక్నికల్ నాలెడ్జ్, నైపుణ్యాభివృద్ధితోనే జీవితంలో మంచి ఉపాధిని, ఉన్నత స్థానాలను పొందగలరన్నారు. కార్యక్రమానికి మరో ముఖ్య అతిథిగా హాజరైన విజయవాడలోని ఎస్టీపీఐ డెప్యూటీ డైరెక్టర్ డీ.కిరణ్ కుమార్ మాట్లాడుతూ చిన్న చిన్న ఆలోచనలకు టెక్నాలజీను జోడించడం ద్వారా పెద్ద బిజినెస్గా మార్చుకోవచ్చన్నారు. కార్యక్రమంలో సత్గురు క్యాటలైజర్స్ సీఈవో పీ.గోపాల క్రిష్ణ, ఎండియా పార్టనర్స్ వెంచర్ క్యాపటలిస్ట్ రాఘవ గుప్త, సక్సీడ్ వెంచర్స్ ఏంజల్ ఇన్వెస్టర్ రుతిక్ జాదవ్, హైదరాబాద్ ఏంజల్స్ బోర్డ్ మెంబర్ సుబ్బారావు నీలంరాజు, విజ్ఞాన్స్ విద్యాసంస్థల చైర్మన్ డాక్టర్ లావు రత్తయ్య, వైస్ చాన్స్లర్ ప్రొఫెసర్ పీ.నాగభూషణ్, వర్సిటీలోని ఆయా విభాగాల డీన్లు, అధిపతులు, సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.