ప్రపంచ ఔషధశాలగా భారత్‌



  ఏపీ ఫార్మసీ కౌన్సిల్‌ రిజిస్ట్రార్‌ డాక్టర్‌ ఎమ్‌ విలియమ్‌ క్యారే

  విజ్ఞాన్‌ ఫార్మసీలో ఘనంగా ప్రారంభమైన అంతర్జాతీయ సదస్సు
టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్:
దేశంలో ఫార్మారంగం శరవేగంగా అభివృద్ధి చెందటంతో పాటు ప్రపంచ దేశాలకు భారతదేశం ఔషధశాలగా పేరొందుతోందని ఏపీ ఫార్మసీ కౌన్సిల్‌ రిజిస్ట్రార్‌ డాక్టర్‌ ఎమ్‌ విలియమ్‌ క్యారే అన్నారు. చేబ్రోలు మండలం వడ్లమూడిలోని విజ్ఞాన్‌ ఫార్మసీ కళాశాలలోని డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ ఫార్మసీ ప్రాక్టీస్‌ ఆధ్వర్యంలో ‘‘ అడ్వాన్డ్స్‌ ప్రాక్టీసెస్‌ అండ్‌ ఇన్నోవేషన్స్‌ ఇన్‌ గ్లోబల్‌ హెల్త్‌కేర్‌’ అనే అంశంపై మూడు రోజులపాటు జరిగే అంతర్జాతీయ సదస్సును శుక్రవారం వైభవంగా ప్రారంభించారు. ఈ అంతర్జాతీయ సదస్సును ‘‘కొలాబరేటివ్‌ బ్లెండింగ్‌ ఆఫ్‌ ఐడియాస్‌ అండ్‌ ఇన్‌సైట్స్‌ టు ఎంపవర్‌ ఫార్మాసిస్ట్స్‌ టువర్డ్స్‌ ఏ హెల్తియర్‌ వరల్డ్‌’’ అనే ఇతివృత్తంతో నిర్వహిస్తున్నారు. ముందుగా జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ  కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఏపీ ఫార్మసీ కౌన్సిల్‌ రిజిస్ట్రార్‌ డాక్టర్‌ ఎమ్‌ విలియమ్‌ క్యారే మాట్లాడుతూ నూతన ఆవిష్కరణలతో కొత్త ఔషధాల అభివృద్ధి, ఉత్పత్తికి నెలవైన ఫార్మా రంగంలో అవకాశాలకు కొదవలేదన్నారు. రోగులకు మందులు అందించడం దగ్గర్నుంచి ఔషధాల పరిశోధన వరకూ విద్యార్థులు అనేక ఉద్యోగ అవకాశాలు అందుకోవచ్చన్నారు. కోవిడ్‌ అనంతరం ఫార్మారంగం ప్రాధాన్యత మరింత పెరిగిందన్నారు. భవిష్యత్‌లో ఫార్మారంగం విస్తరణ, కొత్త ప్రాజెక్టుల కారణంగా ఉపాధి మార్గాలు మరింత విస్తతమవుతాయన్నారు. ఆర్టిఫిసియల్‌ ఇంటెలిజెన్స్, మెషిన్‌ లెర్నింగ్‌ వంటి సరికొత్త టెక్నాలజీలను ఫార్మసీ రంగంలో వినియోగించి సరికొత్త ఆవిష్కరణలను రూపొందించవచ్చునన్నారు. ఫార్మా కోర్సులు చదివిన వారు ఆస్పత్రుల్లో ఫార్మాసిస్టులు, అనలిటికల్, పరిశోధన, అభివృద్ధి, మెడికల్‌ రేటింగ్స్, డేటా అనాలిసిస్‌ విభాగాలతో పాటు పలు ప్రభుత్వ ఉద్యోగాలు సైతం సొంతం చేసుకోవచ్చన్నారు.ఔషధ వినియోగాన్ని మెరుగుపరిచి మందుల లోపాలను తగ్గించటం ద్వారా రోగుల భద్రతను కాపాడటంలో ఫార్మాసిస్టుల కృషి ఎనలేనిదని పేర్కొన్నారు. రోగి ఒక ఔషధాన్ని తీసుకున్నప్పుడు అతనికి ఏ విధంగా కూడా హాని కలిగించకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఫార్మాసిస్టులపై ఉందన్నారు. కార్యక్రమానికి మరో ముఖ్య అతిథిగా హాజరైన యూఎస్‌ఏలోని థింక్‌ రోమన్‌ వెంచర్స్, అవెండా ఇన్నోవేషన్స్‌ చైర్మన్, ఎండీ, డీఎమ్‌ఐ, ప్రెసిడెంట్‌ డాక్టర్‌ అశ్విని ధార్‌ మాట్లాడుతూ మారుతున్న ఆహారపు అలవాట్లకు అనుగుణంగా మానవ శరీరంలో చోటుచేసుకుంటున్న అనేక రుగ్మతల నివారణకు సమర్ధవంతమైన ఔషధం అందించాల్సిన బాధ్యత ఫార్మాసిస్ట్‌లదేనని పేర్కొన్నారు. ప్రతి ఒక్క ఫార్మాసిస్ట్‌ ఆ దిశగా అడుగులు వేయాలని పిలుపునిచ్చారు. అనంతరం కార్యక్రమానికి హాజరైన అతిథులను ఘనంగా సన్మానించారు. ఈ అంతర్జాతీయ సదస్సుకు వివిధ దేశాలు, రాష్ట్రాల నుంచి 1000 మందికి పైగా హాజరయ్యారు. కార్యక్రమంలో యూఎస్‌ఏలోని యూనివర్సిటీ ఆఫ్‌ ఫిండ్లే ప్రొఫెసర్‌ ఎమ్‌.చంద్రశేఖర్, యూనివర్సిటీ ఆఫ్‌ ఫిండ్లే ఫార్మసీ డీన్‌ ఆఫ్‌ ఎక్సటర్నల్‌ అఫైర్స్‌ డాక్టర్‌ టాన్య ఏ.డాటర్‌మన్, విజ్ఞాన్స్‌ విద్యా సంస్థల చైర్మన్‌ డాక్టర్‌ లావు రత్తయ్య, విజ్ఞాన్‌ ఫార్మసీ కళాశాల ప్రిన్సిపల్‌ డాక్టర్‌ శ్రీనివాసబాబు, ఆయా విభాగాల డీన్లు, అధిపతులు, సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.