కొత్త రంగాలను అన్వేషించాలి
- గుంటూరులోని ఐటీసీ లిమిటెడ్ అగ్రి బిజినెస్ డివిజన్ హెచ్ఆర్ వైస్ ప్రెసిడెంట్ పీ.వీరాస్వామి
- విజ్ఞాన్స్ యూనివర్సిటీలో ఘనంగా ముగిసిన జాతీయస్థాయి కాన్ఫరెన్స్
విద్యార్థులు తమను తాము మెరుగుపరుచుకునేందుకు కృషి చేస్తూ తమ పరిజ్ఞానంతో కొత్త రంగాలను అన్వేషించాలని గుంటూరులోని ఐటీసీ లిమిటెడ్ అగ్రి బిజినెస్ డివిజన్ హెచ్ఆర్ వైస్ ప్రెసిడెంట్ పీ.వీరాస్వామి అన్నారు. చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్స్ యూనివర్సిటీలో శనివారం డిపార్ట్మెంట్ ఆఫ్ మేనేజ్మెంట్ స్టడీస్ విభాగం ఆధ్వర్యంలో ‘‘ నేషనల్ కాన్ఫరెన్స్ ఆన్ మేనేజ్మెంట్ పర్స్పెక్టివ్స్ (ఎన్సీఎమ్పీ2023)’’ అనే అంశంపై రెండు రోజులపాటు నిర్వహించిన జాతీయస్థాయి సదస్సు ఘనంగా ముగిసింది. ఈ కార్యక్రమాన్ని ‘‘ మేనేజ్మెంట్ 4.0 ఎమర్జింగ్ ట్రెండ్స్ ఇన్ అనలిటిక్స్ అండ్ డిజిటల్ మేనేజ్మెంట్’’ అనే ఇతివృత్తంతో నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన గుంటూరులోని ఐటీసీ లిమిటెడ్ అగ్రి బిజినెస్ డివిజన్ హెచ్ఆర్ వైస్ ప్రెసిడెంట్ పీ.వీరాస్వామి మాట్లాడుతూ మేనేజ్మెంట్ రంగంలో వస్తున్న నూతన ఒరవడులు, పరిశ్రమల అవసరాలను దృష్టిలో ఉంచుకుని విద్యార్థులకు పాఠ్యప్రణాళికలను రూపొందించడం ద్వారా అంతరాలను తగ్గించవచ్చునన్నారు. విద్యార్థుల్లో నైపుణ్యాలు పెంపొందించడానికి ప్రత్యేక శిక్షణ ఇవ్వాలని పేర్కొన్నారు. నిధుల సోర్సింగ్, నిధుల కేటాయింపు వంటి వాటిని నేర్చుకునేలా చేయడం ద్వారా విద్యార్థుల్లో నైపుణ్యాలు మెరుగవుతాయని ఆయన నొక్కి చెప్పారు. పరిశ్రమలోని వ్యక్తులను ఇటువంటి కార్యక్రమాలకు ఆహ్వానించినప్పుడు వారు యువ విద్యార్థుల ప్రతిభ గురించి తెలుసుకుంటారని ఆయన హైలైట్ చేశారు. యువత చేసే ప్రతిపనిలోనూ కొత్తదనం కోసం ప్రయత్నించాలన్నారు. దాని వల్ల ప్రతి అనుభవం కలకాలం గుర్తుంటుందని, సులువుగా ఉన్నత శిఖరాలకు చేరే వీలు కూడా కలుగుతుందన్నారు. అనంతరం ముఖ్య అతిథిని ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో ఆయా విభాగాల డీన్లు, అధిపతులు, విజ్ఞాన్ సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.