క్రోడీకరించి వర్గీకరిస్తేనే ఉజ్వల భవిష్యత్
చెన్నైలోని డీఎన్ఈజీ టెక్ మెడోస్ ప్రాజెక్ట్ కోఆర్డినేటర్, డేటా సైంటిస్ట్ డాక్టర్ ఈ.డీ.బూబలన్
విజ్ఞాన్స్ యూనివర్సిటీలో వైభవంగా ముగిసిన జాతీయస్థాయి సెమినార్
టాలెంట్ ఎక్స్ ప్రెస్:
విభిన్న వర్గాల వినియోగదారులు, వారి అభిరుచులు, వారి అవసరాలను గుర్తించే క్రమంలో సమాచారాన్ని సేకరించడం... వాటిని క్రోడీకరించి వర్గీకరిస్తేనే విద్యార్థులకు ఉజ్వల భవిష్యత్ ఉంటుందని చెన్నైలోని డీఎన్ఈజీ టెక్ మెడోస్ ప్రాజెక్ట్ కోఆర్డినేటర్, డేటా సైంటిస్ట్ డాక్టర్ ఈ.డీ.బూబలన్ తెలిపారు. చేబ్రోలు మండలం వడ్లమూడిలోని విజ్ఞాన్స్ యూనివర్సిటీ స్కూల్ ఆఫ్ అప్లైడ్ సైన్సెస్ అండ్ హుమానిటీస్ విభాగంలోని డిపార్ట్మెంట్ ఆఫ్ మేథమాటిక్స్ అండ్ స్టాటిస్టిక్స్ విభాగం ఆధ్వర్యంలో ‘‘ ఎండ్ టు ఎండ్ డేటా సైన్స్’’ అనే అంశంపై రెండు రోజుల పాటు జరిగిన జాతీయస్థాయి వర్క్షాప్ను ఘనంగా ముగించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన డేటా సైంటిస్ట్ డాక్టర్ ఈ.డీ.బూబలన్ మాట్లాడుతూ వినియోగదారుల నుంచి సేకరించిన సమాచారాన్ని విశ్లేషించి, సూచనలు, సలహాలతో కూడిన నివేదికలు రూపొందించే డేటా సైంటిస్ట్లకు ఇటీవల కాలంలో డిమాండ్ విపరీతంగా పెరుగుతోందన్నారు. ముఖ్యంగా ఈ–కామర్స్, ఐటీ రంగ సంస్థల్లో డేటా సైంటిస్ట్ల కొరత ఉందన్నారు. మ్యాథమెటిక్స్, స్టాటిస్టిక్స్, ప్రాబబిలిటీ వంటి స్పెషలైజేషన్లు చదివి స్టాటిస్టికల్ అనాలిసిస్ సిస్టమ్, హడూప్ వంటి తదితర సాఫ్ట్వేర్ ప్రోగ్రామ్లలో శిక్షణ పొందితే డేటా సైంటిస్ట్ నైపుణ్యాలు సొంతం చేసుకోవచ్చని పేర్కొన్నారు. కార్యక్రమానికి మరో ముఖ్య అతిథిగా హాజరైన డేటా సైంటిస్ట్ వినోత్ కుమార్ మాట్లాడుతూ మేథమేటిక్స్, స్టాటిస్టిక్స్ రంగాలలో పరిశోధనలు పెరిగినట్లైతే మానవాళికి ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయని వివరించారు. దీనిపై యువత దృష్టి సారించాలన్నారు. ఇంజినీరింగ్ విద్యార్థులు వారి బ్రాంచిలకు సంబంధించిన సబ్జెక్టులపైనేకాకుండా ప్రాథమిక సైన్స్, మేథమేటిక్స్ విషయాలపై అవగాహనతో ఉంటే ఎంతో మంచిదని తెలిపారు. భవిష్యత్తులో ఈ విజ్ఞానం ఎంతగానో ఉపయోగపడుతుందని సూచించారు. కార్యక్రమంలో ఆయా విభాగాల డీన్లు, అధిపతులు, సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.