రేపటి నుంచి విజ్ఞాన్ మహోత్సవ్
_మూడు రోజుల పాటు అలరించనున్న జాతీయ స్థాయి వేడుకలు
_సందడి చేయనున్న సినీతారలు
_ఆయా రాష్ట్రాల నుంచి 50 వేల మంది విద్యార్థులు రాక
చేబ్రోలు మండలం వడ్లమూడిలోని విజ్ఞాన్స్ యూనివర్సిటీ ప్రతిష్టాత్మకంగా నిర్వహించే జాతీయ స్థాయి విజ్ఞాన్ మహోత్సవ్కు ఏర్పాట్లు పూర్తయ్యాయని వర్సిటీ వైస్ చాన్స్లర్ ప్రొఫెసర్ పీ.నాగభూషణ్ బుధవారం తెలిపారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వైస్ చాన్స్లర్ మాట్లాడుతూ విజ్ఞాన్ మహోత్సవ్ కార్యక్రమాన్ని నేటి నుంచి మూడు రోజుల పాటు అత్యంత వైభవంగా నిర్వహించనున్నామని పేర్కొన్నారు. జాతీయస్థాయిలో ప్రతిఏటా విజ్ఞాన్ మహోత్సవాన్ని నిర్వహిస్తున్నామని తెలిపారు. నేటి కార్యక్రమానికి ముఖ్య అతిథిలుగా చిందు యక్షజ్ఞానం ఆర్టిస్ట్ గద్దం సామయ్య (పద్మశ్రీ అవార్డు గ్రహీత), ఇండియన్ మ్యూజిక్ కంపోజర్ రఘు కుంచె హాజరవుతారని వెల్లడించారు. 3వ తారీఖున జరిగే ముగింపు కార్యక్రమానికి ఇండియన్ నేషనల్ క్రికెట్ టీమ్ మాజీ సెలక్టర్, క్రికెటర్ ఎమ్మెస్కే ప్రసాద్ రానున్నారని తెలియజేసారు. విజ్ఞాన్ మహోత్సవ్లో పాల్గొనేందుకు దేశవ్యాప్తంగా ఆయా రాష్ట్రాల నుంచి 50వేల మంది విద్యార్థులు తరలి రానున్నారని వెల్లడించారు. విజ్ఞాన్ మహోత్సవ్ పోటీల విజేతలకు రూ.15 లక్షలకు పైగా బహుమతులను అందజేస్తామని తెలిపారు. విజ్ఞాన్ మహోత్సవాన్ని ఈ ఏడాది వినూత్నంగా నిర్వహించడంతో పాటు మొట్టమొదటసారిగా క్రికెట్ చాంపియన్షిప్ను ప్రారంభించామన్నారు.
మహోత్సవ్లో సందడి చేయనున్న సినీతారలు
నేటి నుంచి మూడు రోజుల పాటు నిర్వహించనున్న విజ్ఞాన్స్ మహోత్సవ్లో సినీ తారలు సందడి చేయనున్నారు. 3న జరిగే ముగింపు కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఇండియన్ ఫిల్మ్ యాక్టర్ కిరణ్ అబ్బవరం, ఇండియన్ స్క్రీన్ రైటర్ బుర్రా సాయి మాధవ్లు విచ్చేయనున్నారు. అంతేకాకుండా ఈ నెల 16న విడుదల కాబోతున్న ‘‘సుందరం మాస్టర్’’ సినిమా ప్రమోషన్స్లో భాగంగా హీరో హర్ష చెముడు, హీరోయిన్ దివ్య శ్రీపాదలు 2వ తారీఖున సందడి చేయనున్నారు.
75 ఈవెంట్ల నిర్వహణ
విజ్ఞాన్స్ యూనివర్సిటీ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న మహోత్సవ్లో మొత్తం 75 ఈవెంట్లను నిర్వహించనున్నారు. తొలుత నిర్వహించే స్పోర్ట్స్ ఫీట్లో వాలీబాల్, బాస్కెట్బాల్, కబడ్డీ, టేబుల్ టెన్నిస్, చెస్, అథ్లెటిక్స్, త్రోబాల్ తదితర క్రీడాంశాల్లో జాతీయస్థాయిలో విద్యార్థులకు పోటీలు ఉంటాయని చెప్పారు. వీటితోపాటు కల్చరల్స్, లిటెరరీ, ఫైన్ ఆర్ట్స్, ఫ్యాషన్, మ్యూజిక్, డాన్స్, స్పాట్లైట్, థియేటర్ ఆర్ట్స్ వంటి తదితర రంగాలను కలుపుకుని సాంకేతిక, సాంస్కృతికాంశాల్లో జాతీయస్థాయిలో పోటీలు ఉంటాయని వివరించారు. పారా అథ్లెటిక్స్ విద్యార్థుల కోసం ప్రత్యేకంగా ట్రాక్ అండ్ ఫీల్డ్ ఈవెంట్స్ నిర్వహిస్తున్నామని తెలియజేసారు. దేశవ్యాప్తంగా విద్యార్థులంతా ఈ అవకాశాన్ని పూర్తిస్థాయిలో వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో విజ్ఞాన్స్ విద్యా సంస్థల చైర్మన్ డాక్టర్ లావు రత్తయ్య, వైస్ చాన్స్లర్ ప్రొఫెసర్ పీ.నాగభూషణ్, రిజిస్ట్రార్ డాక్టర్ ఎంఎస్ రఘునాథన్, ఆయా విభాగాల డీన్లు, అధిపతులు పాల్గొన్నారు.