విజ్ఞాన్స్‌ యూనివర్సిటీలో ప్రారంభమైన జాతీయస్థాయి క్రికెట్‌ పోటీలు

విజ్ఞాన్స్‌ యూనివర్సిటీలో ప్రారంభమైన జాతీయస్థాయి క్రికెట్‌ పోటీలు
టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్:
చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్స్‌ యూనివర్సిటీ విద్యార్థుల ఆధ్వర్యంలో సోమవారం నూతన సంవత్సర వేడుకలతో పాటు మహోత్సవ్‌–2కే24లో భాగంగా నిర్వహిస్తున్న జాతీయ స్థాయి క్రికెట్‌ చాంపియన్‌షిప్‌ పోటీలను ఘనంగా ప్రారంభించారు. ఈ చాంపియన్‌షిప్‌లో విజేతలుగా నిలిచిన జట్లకు ప్రశంసా పత్రాలు, మెడల్స్‌తో పాటు విన్నర్‌కు రూ. 50,000, రన్నర్‌కు రూ.30,000, మూడో స్థానంకు రూ.20,000, నాలుగో స్థానంకు రూ.10,000 నగదు బహుమతులను అందజేస్తామని వైస్‌ చాన్స్‌లర్‌ ప్రొఫెసర్‌ పీ.నాగభూషణ్‌ వెల్లడించారు. విద్యార్థులు కోటి ఆశలతో నూతన సంవత్సరానికి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన విజ్ఞాన్స్‌ యూనివర్సిటీ వైస్‌ చాన్స్‌లర్‌  ప్రొఫెసర్‌ పీ.నాగభూషణ్‌ మాట్లాడుతూ విద్యార్థులు జీవితంలో ఉన్నత స్థానాలను అధిరోహించడానికి సరికొత్త మార్గాలను అన్వేషించాలన్నారు. నూతన టెక్నాలజీలపై అవగాహన పెంచుకున్న విద్యార్థులకు మాత్రమే భవిష్యత్తులో ఉన్నత ఉద్యోగాలు దక్కుతాయని తెలిపారు. 2024 సంవత్సరంలో విద్యార్థులు కష్టమైన లక్ష్యాన్ని ఎంచుకుని... వాటిని సాధించేందుకు పట్టుదలతో కృషి చేయాలని సూచించారు. విద్యార్థులకు నైపుణ్యంతో పాటు పరిశోధనాత్మక ఆలోచనలు కలిగిన విద్యా విధానం ఉండాలని తెలిపారు.  అనంతరం విద్యార్థులందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసి కేక్‌ను కట్‌ చేశారు. క్రికెట్‌ చాంపియన్‌షిప్‌లో భాగంగా మ్యాన్‌ ఆఫ్‌ ద సిరీస్, బెస్ట్‌ బ్యాట్స్‌మెన్, బెస్ట్‌ బౌలర్, మోస్ట్‌ వాల్యుబుల్‌ ప్లేయర్‌ అవార్డులను కూడా అందజేస్తామన్నారు. నూతన సంవత్సర వేడుక కార్యక్రమంలో వర్సిటీ ఇంచార్జి రిజిస్ట్రార్‌ డాక్టర్‌ పీఎంవీ రావు, ఆయా విభాగాల డీన్లు, అధిపతులు, అధ్యాపక సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.