భారత్ – ఇజ్రాయిల్ సంబంధాలు మరింత బలోపేతం
- భారతదేశంలో ఇజ్రాయిల్ రాయబారి నవోర్ గిలోన్
- విజ్ఞాన్స్ యూనివర్సిటీను సందర్శించిన ఇజ్రాయిల్ ప్రతినిధులు
భారత్–ఇజ్రాయిల్ దేశాల మధ్య అగ్రికల్చర్ రంగం విభాగంలో టెక్నాలజీతోపాటు పరస్పర అవగాహన సంబంధాలు మరింత బలోపేతం కానున్నాయని భారతదేశంలో ఇజ్రాయిల్ రాయబారి నవోర్ గిలోన్ అన్నారు. చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్స్ యూనివర్సిటీకు ముఖ్య అతిథిగా విచ్చేసిన ఇజ్రాయిల్ రాయబారి నవోర్ గిలోన్తో పాటు ఇతర ప్రతినిధులకు వర్సిటీ చైర్మన్ డాక్టర్ లావు రత్తయ్య, వైస్ చాన్స్లర్ ప్రొఫెసర్ పీ.నాగభూషణ్ పుష్పగుచ్చం అందించి సాదరంగా ఆహ్వానించారు. యూనివర్సిటీలో జరిగిన ఈ కార్యక్రమంలో అకడమియాతో పాటు దౌత్యపరమైన అంశాల గురించి విజ్ఞాన్స్ యూనివర్సిటీ వైస్ చాన్స్లర్ ప్రొఫెసర్ పీ.నాగభూషణ్తో ఆయన చర్చించారు. ఈ సందర్భంగా ఇజ్రాయిల్ రాయబారి నవోర్ గిలోన్తో విజ్ఞాన్స్ విద్యాసంస్థల చైర్మన్ డాక్టర్ లావు రత్తయ్య, వైస్ చైర్మన్ లావు శ్రీకృష్ణదేవరాయలు, వైస్ చాన్స్లర్ ప్రొఫెసర్ పీ.నాగభూషణ్, రిజిస్ట్రార్ డాక్టర్ ఎంఎస్ రఘునాథన్, వివిధ విభాగాల డీన్లు, అధిపతులతో ప్రత్యేక సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఇజ్రాయిల్ దేశ అంబాసిడర్ నవోర్ గిలోన్ మాట్లాడుతూ అగ్రికల్చర్ టెక్నాలజీ, విద్య, పరిశోధనలతో పాటు సాంస్కృతిక మార్పిడి, పరస్పర సహకార అవకాశాల అన్వేషణ వంటి అంశాల గురించి చర్చించామన్నారు. ఉమ్మడిగా కార్యక్రమాలను నిర్వహించడం ద్వారా ఇరువురి మధ్య భాగస్వామ్యం పటిష్టమవ్వడంతో పాటు విద్యాపరమైన నైపుణ్యాలను పెంపొందించుకోవచ్చన్నారు. దీని ద్వారా విద్యార్థులకు, అధ్యాపక సిబ్బందికి అపారమైన ప్రయోజనాలు చేకూరుతాయని వెల్లడించారు. విజ్ఞాన్స్ యూనివర్సిటీ వైస్ చాన్స్లర్ ప్రొఫెసర్ పీ.నాగభూషణ్ మాట్లాడుతూ స్టూడెంట్స్, ఫ్యాకల్టీ ఎక్స్చేంజ్, అకడమిక్, పరిశోధన, కన్సల్టన్సీ, ఎంటర్ప్రెన్యూర్షిప్ ప్రోగ్రామ్స్ను అభివృద్ధి చేసుకోవడానికి అవగాహన ఒప్పందం చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నామన్నారు. వీటితో పాటు జాయింట్ మాస్టర్స్, పీహెచ్డీ ప్రోగ్రామ్స్, సెంటర్ ఆఫ్ ఎక్స్లెన్స్లను కూడా ప్రారంభిచేలా కృషి చేయాలని కోరారు. అనంతరం ముఖ్య అతిథిని విజ్ఞాన్స్ యూనివర్సిటీ ప్రతినిధులు ఘనంగా సన్మానించారు. రాబోయే కాలంలో ఇరుదేశాల మధ్య సంబంధాలను మరింత బలోపేతం చేయడంతో పాటు సరికొత్త టెక్నాలజీ, ఇండస్ట్రీ, అకడమియా ప్రోగ్రామ్స్ను రూపొందిచడానికి సిద్ధంగా ఉన్నామన్నారు. కార్యక్రమంలో విజ్ఞాన్స్ విద్యాసంస్థల చైర్మన్ డాక్టర్ లావు రత్తయ్య, వైస్ చైర్మన్ లావు శ్రీకృష్ణదేవరాయలు, వైస్ చాన్స్లర్ ప్రొఫెసర్ పీ.నాగభూషణం, రిజిస్ట్రార్ డాక్టర్ ఎంఎస్ రఘునాథన్, ఆయా విభాగాల డీన్లు, అధిపతులు, విద్యార్థులు పాల్గొన్నారు.