విజ్ఞాన్‌లో పల్లెవించిన సంక్రాంతి

విజ్ఞాన్‌లో పల్లెవించిన సంక్రాంతి

 - సంక్రాంతి అంటే రైతుల పండుగ
 - విజ్ఞాన్స్‌ విద్యాసంస్థల చైర్మన్‌ డాక్టర్‌ లావు రత్తయ్య
- విజ్ఞాన్‌ విశ్వవిద్యాలయంలో వైభవంగా ముందస్తు   సంక్రాంతి వేడుకలు
- సంప్రదాయ వస్త్రాల్లో మెరిసిన విద్యార్థులు
టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్:
సంక్రాంతి విశిష్టతను తెలిపే రంగురంగుల రంగవల్లులు, హరిదాసు సంకీర్తనలు, కోలాటాలతో తెలుగు సంప్రదాయాలు ఉట్టిపడేలా చేబ్రోలు మండలం వడ్లమూడిలోని విజ్ఞాన్స్‌ యూనివర్సిటీలో శుక్రవారం సంక్రాంతి సంబరాలు అంబరాన్నంటాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన విజ్ఞాన్స్‌ విద్యాసంస్థల చైర్మన్‌ డాక్టర్‌ లావు రత్తయ్య విద్యార్థులతో మాట్లాడుతూ సంక్రాంతి అంటేనే రైతుల పండుగని తెలిపారు. మన పండుగల్లోని విశిష్టతను, శాస్త్రీయతను విద్యార్థులు గుర్తించాలని సూచించారు. ఈ సమయంలో రైతు లోకం పంట చేతికొచ్చిన ఆనందంలో ఉంటుందని చెప్పారు. సంక్రాంతి పర్వదినాల్లో పల్లెటూళ్లు ఎంతో అందంగా, ఆహ్లాదంగా ఉంటాయని చెప్పారు. రకరకాల జానపద వినోద కళాకారులు, పగటివేషధారులు ఈ పండుగ సమయంలో పల్లెల్లో వినోదాన్ని పంచుతారని తెలిపారు. ఎడ్ల పందేలు, కోడి పందేలు, రంగవల్లులు, గొబ్బెమ్మలు.. ఇలా సంక్రాంతి అంటేనే సరదాల పండుగ అని చెప్పారు. తమ విద్యాసంస్థల్లో ఏటా అన్ని పండుగలను వైభవంగా జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోందని తెలిపారు. పిల్లలకు సంస్కృతి సంప్రదాయాలపై గౌరవం పెంచాలనే ఉద్దేశంతో ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని చెప్పారు. విజ్ఞాన్స్‌ విద్యాసంస్థల వైస్‌ చైర్మన్‌ లావు శ్రీకృష్ణదేవరాయలు మాట్లాడుతూ ప్రతి విషయాన్ని వినూత్నంగా ఆలోచించాలని పేర్కొన్నారు. పాత పద్ధతులను గుడ్డిగా అనుసరించకుండా సొంత దారులు వెతకాలని విద్యార్థులకు సూచించారు.  
కళకళలాడిన యూనివర్సిటీ ప్రాంగణం
సంక్రాంతి సంబరాలతో విశ్వవిద్యాలయ ప్రాంగణం కొత్త కళను సంతరించుకుంది. విద్యార్థులు గోమాతను పూజించారు. పొంగళ్లు పొంగించారు. చిన్నారులకు భోగి పళ్లు పోశారు. చెరుకుగడలు అల్లారు. రంగురంగుల ముగ్గులు వేశారు. భోగి మంటలు వేశారు. సంక్రాంతి పాటలు పాడారు. సంక్రాంతి విశిష్టతను తెలిపేలా విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమ నృత్యాలు ఆకట్టుకున్నాయి. బొమ్మల కొలువులు ఏర్పాటుచేశారు. హరిదాసు సంకీర్తనలు వినిపించాడు. పిండి వంటలు వండారు. డోలు, సన్నాయిలతో వినోద బృందం కనువిందు చేసింది. గంగిరెద్దుల విన్యాసాలు ఆకట్టుకున్నాయి. రథం ముగ్గులు ఆకర్షించాయి. గాలిపటాలు, బెలూన్లు ఎగురవేశారు. ప్రత్యేక పూజలు జరిపారు. కార్యక్రమంలో విజ్ఞాన్స్‌ విద్యాసంస్థల చైర్మన్‌ డాక్టర్‌ లావు రత్తయ్య, వైస్‌ చైర్మన్‌ లావు శ్రీకృష్ణదేవరాయలు, వర్సిటీ వైస్‌ చాన్స్‌లర్‌ ప్రొఫెసర్‌ పీ.నాగభూషణ్, రిజిస్ట్రార్‌ డాక్టర్‌ ఎంఎస్‌ రఘునాథన్, ఆయా విభాగాల డీన్లు, అధిపతులు, సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.