విద్యార్థుల ప్రవర్తనను అధ్యాపకులు గమనించాలి
- విజ్ఞాన్స్ విద్యా సంస్థల చైర్మన్ డాక్టర్ లావు రత్తయ్య
- విజ్ఞాన్స్ యూనివర్సిటీలో ఘనంగా ముగిసిన మూడు రోజుల వర్క్షాప్
అధ్యాపకులు, కౌన్సిలర్లు తరగతి గదిలోని విద్యార్థుల ప్రవర్తనను ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉండాలని విజ్ఞాన్స్ విద్యా సంస్థల చైర్మన్ డాక్టర్ లావు రత్తయ్య అన్నారు. చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్ యూనివర్సిటీలోని సోషల్ సైన్సెస్ అండ్ హుమానిటీస్, అకాడమీ ఫర్ ఫ్యాకల్టీ డెవలప్మెంట్, ఐక్యూఏసీ, ఏపీఏ ఇండియాల సంయుక్త ఆధ్వర్యంలో ‘‘ఎంపవరింగ్ త్రూ ప్రివెన్షన్ – ప్రొఫెషనల్ ట్రైనింగ్ ఆన్ లైఫ్–సేవింగ్ ఎడ్యుకేషన్’’ అనే అంశంపై మూడు రోజుల పాటు అధ్యాపకులకు, కౌన్సిలర్లకు నిర్వహించిన వర్క్షాప్ను ఆదివారం ఘనంగా ముగించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన విజ్ఞాన్స్ విద్యా సంస్థల చైర్మన్ డాక్టర్ లావు రత్తయ్య విద్యార్థులకు అధ్యాపకులు వాళ్ల పరిధిని దాటి క్రియేటివ్గా, సరికొత్తగా ఆలోచించేలా ప్రేరిపించాలన్నారు. విద్యార్థులకు సమస్యలు ఎదురైనప్పుడు అది విద్యార్థి సమస్యలా భావించకుండా తానైతే ఎలా ఎదుర్కొంటారో ఆ విధంగా పరిష్కరించాలన్నారు. కార్యక్రమానికి మరో ముఖ్య అతిథిగా హాజరైన వర్సిటీ వైస్ చాన్స్లర్ ప్రొఫెసర్ పీ.నాగభూషణ్ మాట్లాడుతూ మనసంతా ప్రతికూల ఆలోచనలతో నిండిపోతే ఏ పనీ చేయాలనిపించదన్నారు. గతంతో మొదలుపెట్టిన పనినీ చివరి వరకూ కొనసాగించలేరు. ఏ విషయం గురించైనా ప్రతికూలంగా ఆలోచిస్తే నిరాశ పెరిగిపోతుంది. ఎప్పటికప్పుడు సానుకూలంగా ఆలోచించడానికి ప్రయత్నిస్తే ఏ పనినైనా సగంలోనే వదిలిపెట్టాల్సిన అవసరం రాదన్నారు. కాబట్టి ఎంతటి క్లిష్ట పరిస్థితులనైనా సానుకూల ఆలోచనలతో జయించవచ్చనే విషయాన్ని గుర్తుంచుకోవాలని తెలియజేసారు. కార్యక్రమంలో ఏపీఏఐ నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్ క్రిష్ణ భరత్, ఉస్మానియా యూనివర్సిటీ యూజీసీ–హెచ్ఆర్డీసీ అసిస్టెంట్ డైరక్టర్ డాక్టర్ పీ.స్వాతి, హైదరాబాద్లోని పీడియాట్రిక్ సైకాలజిస్ట్ గంగాధర్ బరెడ్డి, వైజాగ్లోని ద వింగ్స్ ఆఫ్ మైండ్ ఫౌండర్, సైకాలజిస్ట్ అండ్ జర్నలిస్ట్ రమ్య అగస్తి, బెజవాడ ఇనిస్టిట్యూట్ ఫర్ లెర్నింగ్ డెవలప్మెంట్ లక్ష్మిరావ్, ఏపీఏఐ ఏపీ కమిటీ ప్రెసిడెంట్ ఎమ్పీ జానకిరామ్, ఆయా విభాగాల డీన్లు, అధిపతులు, అధ్యాపకులు, కౌన్సిలర్లు పాల్గొన్నారు.