విజ్ఞాన్స్ యూనివర్సిటీను సందర్శించిన జపాన్ ప్రతినిధులు
చేబ్రోలు మండలం వడ్లమూడిలోని విజ్ఞాన్స్ యూనివర్సిటీను సోమవారం న్యూఢిల్లీలో గల అంబసీ ఆఫ్ జపాన్ ప్రతినిధులు సందర్శించారు. ముందుగా అంబసీ ఆఫ్ జపాన్ ప్రతినిధులైన కౌన్సిలర్ కెంటారో ఒరిటా, సెకండ్ సెక్రటరీ రైతా సైటో, అడ్మినిస్ట్రేటివ్ అటాచీ రికుతో ఐటోలకు విజ్ఞాన్స్ విద్యాసంస్థల చైర్మన్ డాక్టర్ లావు రత్తయ్య, వైస్ చాన్స్లర్ ప్రొఫెసర్ పీ.నాగభూషణం ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వైస్ చాన్స్లర్ ప్రొఫెసర్ పీ.నాగభూషణ్ మాట్లాడుతూ గుంటూరు రీజియన్లోని విద్యార్థులు నేర్చుకోవడానికి వీలుగా జపనీస్ లాంగ్వేజ్ సెంటర్ను విజ్ఞాన్స్ యూనివర్సిటీలో ఏర్పాటు చేయాలని జపాన్ ప్రతినిధులను కోరారు. అంతేకాకుండా స్టూడెంట్స్, ఫ్యాకల్టీ ఎక్స్చేంజ్, అకడమిక్, పరిశోధన, కన్సల్టన్సీ, ఎంటర్ప్రెన్యూర్షిప్ ప్రోగ్రామ్స్ను అభివృద్ధి చేసుకోవడానికి అవగాహన ఒప్పందం చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నామన్నారు. వీటితో పాటు జాయింట్ మాస్టర్స్, పీహెచ్డీ ప్రోగ్రామ్లను కూడా ప్రారంభిచేలా కృషి చేయాలని కోరారు. ముఖ్య అతిథిగా యూనివర్సిటీకు విచ్చేసిన అంబసీ ఆఫ్ జపాన్ ప్రతినిధులైన కౌన్సిలర్ కెంటారో ఒరిటా మాట్లాడుతూ రాబోయే కాలంలో ఇండియా–జపాన్ దేశాల మధ్య సంబంధాలను మరింత బలోపేతం చేయడంతో పాటు సరికొత్త టెక్నాలజీ, ఇండస్ట్రీ, అకడమియా ప్రోగ్రామ్స్ను రూపొందిచడానికి సిద్ధంగా ఉన్నామన్నారు. జపాన్ దేశంలో యువ ఇంజినీర్లకు లక్షల్లో ఉపాధి అవకాశాలు అందించడానికి సిద్ధంగా ఉన్నామన్నారు. తమ దేశంలో యువ ఇంజనీర్ల కొరత అధికంగా ఉందని... అందుకే మేము యువ ఇంజనీర్లతో పాటు అన్–స్కిల్డ్ లేబర్ కోసం యువత అధికంగా ఉన్న ఇండియా వైపే చూడాల్సి వస్తుందన్నారు. గుంటూరు రీజియన్లోని ప్రజలకు ఉపయోగపడేలా జపనీస్ లాంగ్వేజ్ సెంటర్ను ఏర్పాటు చేయడానికి సానుకూలంగా స్పందించారు. అనంతరం జపాన్ ప్రతినిధులు విద్యార్థులతో ఇంటరాక్టివ్ సెషన్ను నిర్వహించారు. కార్యక్రమంలో విజ్ఞాన్స్ విద్యాసంస్థల చైర్మన్ డాక్టర్ లావు రత్తయ్య, వైస్ చాన్స్లర్ ప్రొఫెసర్ పీ.నాగభూషణం, ఆయా విభాగాల డీన్లు, అధిపతులు, విద్యార్థులు పాల్గొన్నారు.