హాస్యబ్రహ్మ బ్రహ్మానందం..

‘‘ఖాన్‌తో గేమ్స్ ఆడకు.. శాల్తీలు లేచిపోతాయ్.. నన్ను ఇన్వాల్వ్ చెయ్యకండి రావుగారు.. నెల్లూరు పెద్దా రెడ్డి ఎవరో తెలీదా..
ఏంటి.. ఇరుకుపాలెం వాళ్లంటే ఎకసెక్కాలుగా ఉందా.. రకరకాలుగా ఉంది మాష్టారు.. అబ్బా మీరు సిగ్గుపడకండి.. చచ్చిపోవాలనిపిస్తుంది..
నా పర్ఫార్మెన్స్ నచ్చితే ఎస్ఎమ్ఎస్ చేయండి..’’

ఈ డైలాగ్స్ వింటే కింగ్ ఆఫ్ కామెడీ, హాస్యబ్రహ్మ, పద్మశ్రీ, గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్.. డా. #బ్రహ్మానందం గుర్తొస్తారు.. ఆయన పేరు చెబితే చాలు.. ముఖాల్లో చిరునవ్వు వెల్లి విరుస్తుంది. గత మూడు దశాబ్దాలుగా తన మార్క్ కామెడీతో తెలుగు ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తున్న బ్రహ్మానందం గారి పుట్టినరోజు ఫిబ్రవరి 1...ఈ ఏడాదితో 65వ వసంతంలోకి అడుగుపెడుతున్నారాయన.

ఆయన గురించి ఆయన నటించిన సినిమాల గురించి పోషించిన పాత్రల గురించి ఎంత చెప్పినా తక్కువే. తెలుగు సినిమా కామెడీలో బ్రహ్మానందానిది ఓ డిఫరెంట్ స్టైల్, ఆయన మార్క్ హాస్యం, హావభావాలు, డ్యాన్స్ మరెవరికీ సాధ్యం కావు అన్నంతగా తెలుగు సినిమా హాస్యంపై చెరగని ముద్ర వేశారాయన. నవ్వడం ఒక యోగం, నవ్వించడం ఒక భోగం, నవ్వకపోవడం ఒక రోగం’ అనే తన గురువు జంధ్యాల మాటలను పాటించే బ్రహ్మానందం.. సినిమా సినిమాకీ వైవిధ్యం చూపించేవారు.

#కన్నెగంటి #బ్రహ్మానందం గారు వివిధ భాషలలో వెయ్యికి పైగా సినిమాలలో నటించి 2010 లో గిన్నిస్ రికార్డుల్లోకి ఎక్కారు. భారత ప్రభుత్వం పద్మశ్రీ పురస్కారం ఇచ్చింది. ఉత్తమ హాస్య నటుడిగా ఐదు నంది పురస్కారాలు, ఒక ఫిల్మ్ ఫేర్ పురస్కారం, ఆరు సినీ మా అవార్డులు, మూడు సైమా పురస్కారాలు అందుకున్నారు. 2005 లో ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం ఆయనకు గౌరవ డాక్టరేటు ప్రధానం చేసింది.

బాల్యం
బ్రహ్మానందం గారు ఫిబ్రవరి 1, 1956 సంవత్సరంలో గుంటూరు జిల్లా, సత్తెనపల్లి తాలూకా ముప్పాళ్ల మండలం చాగంటివారిపాలెం గ్రామంలో జన్మించారు. తండ్రి కన్నెగంటి నాగలింగాచారి, తల్లి పేరు కన్నెగంటి లక్ష్మీనరసమ్మ. తను పుట్టగానే తల్లికి గుర్రపువాతం వచ్చి, అందరి దృష్టిలో అపరాధిలా నిలిచారు. అప్పటికే ఆరుగురు పిల్లలకు జన్మనిచ్చిన తల్లి, ఇతని ప్రసవంతో చనిపోతుందని భావించారు. కానీ అదృష్టవశాత్తు ఆమె ప్రాణాలు నిలిచాయి.

చదువు
సత్తెనపల్లి శరభయ్య హైస్కూలులో విద్యార్థిగా చేరి పాఠాలు నేర్చారు. తండ్రి కన్నెగంటి నాగలింగాచారి సన్నిహితులైన సున్నం ఆంజనేయులు ప్రోద్బలంతో భీమవరం డి.ఎన్.ఆర్. కాలేజీలో ఇంటర్మీడియట్, డిగ్రీ పూర్తి చేశారు. గుంటూరు పీజీ సెంటర్లో తెలుగు సాహిత్యంలో ఎమ్మే పట్టా పుచ్చుకొన్నారు. బ్రహ్మానందం అత్తిలిలో తొమ్మిది సంవత్సరాలు లెక్చరర్‌గా పనిచేశాక సినీరంగంలోకి అడుగుపెట్టారు.

సినీరంగ ప్రవేశం
ఇప్పట్లోలా ఇలా వెళ్లి అలా సినిమాలు చూసే అవకాశం ఆయనకు ఉండేది కాదు. ఉమ్మడి కుటుంబంలో మధ్యతరగతి జీవితాన్ని సాగిస్తున్న ఆ ఇంట్లో ఆర్థిక సమస్యలతో పాటూ జనాభా కూడా ఎక్కువే! అమ్మ అప్పుడప్పుడూ ఇరుగు పొరుగుల్ని అనుకరిస్తూ మాట్లాడే హాస్యోక్తులే తనకు వినోదం! తండ్రి రంగస్థల నటుడే అయినా సీరియస్ ప్రొఫెషనేమీ కాదు. తల్లిదండ్రులకున్న కొద్దో గొప్పో కళాభిరుచి తనకీ అబ్బిందేమోనని బ్రహ్మానందం భావిస్తారు. బాల్యంలో మారాం చేయకుండా బడికి బుద్ధిగానే వెళ్ళినా, ఎస్.ఎస్.ఎల్.సి.లో గట్టిగానే పాసైనా, చిన్న తప్పులు చేసినా, తండ్రి నుంచి బుద్ధితక్కువ వాడంటూ చివాట్లు తప్పేవి కావు. అయితే తెలివితక్కువ వాడని మాత్రం ఆయన ఎన్నడూ అనలేదంటారు. చదువుతున్నప్పుడే స్వర అనుకరణలు (మిమిక్రీ) చేయడం, సాంస్కృతిక బృందాలలో (కల్చరల్ ఆర్గనైజషన్) చురుకుగా పాల్గొనడం ఈయనకు అలవడింది. అత్తిలిలో ఉపన్యాసకుడుగా ఉంటూనే పలు నిజజీవితంలోని వ్యక్తులను అనుకరుణ చేస్తూ అందరి ప్రశంసలూ పొందిన బ్రహ్మానందం 1985లో దూరదర్శన్లో వచ్చిన 'పకపకలు' కార్యక్రమాన్ని సమర్థంగా నిర్వహించగా, మంచి స్పందన వచ్చింది. దూరదర్శన్ తప్ప, ఇతర ఛానెళ్ళేవీ లేని ఆ రోజుల్లో ఎక్కడికి వెళ్ళినా అందరూ బ్రహ్మానందాన్ని ఇట్టే గుర్తు పట్టేవారు.

తొలి సినిమా
బ్రహ్మానందం గారిని మొట్టమొదటి సారిగా మూవీ కెమెరా ముందు మేకప్ వేసి నిలబెట్టినవ్యక్తి దర్శకుడు వేజళ్ల సత్యనారాయణ.నరేశ్ కథానాయకుడిగా నటించిన శ్రీ తాతావతారం అనే చిత్రంలో కథానాయకుడి నలుగురు స్నేహితులలో ఒకడిగా నటించారు. విశేషం ఏమిటంటే తన పుట్టినరోజు ఫిబ్రవరి 1 వ తేదీన ఆ సినిమాలో తొలి వేషం వేశారు. 1985లో హైదరాబాద్ వెస్లీ కాలేజీలో మధ్యాహ్నం పన్నెండు గంటలకు హీరో నరేశ్‌తో తీసిన తొలి షాట్ బ్రహ్మానందం నటజీవితానికి శ్రీకారం చుట్టింది. ఈ చిత్రంతో నటించడం ప్రారంభించినా, తొలిసారి విడుదలయిన చిత్రం మాత్రం జంధ్యాల దర్శకత్వంలో వచ్చిన అహ! నా పెళ్ళంట!.

పేరు తెచ్చిన పాత్ర 
"...పాడె మీద పైసలు ఏరుకొనే వెధవా... పోతావ్‌రా రేయ్... నాశనమై పోతావ్..." అంటూ యజమాని పీనాసితనాన్ని బాహాటంగా కక్కలేక తనలోనే అగ్గిబుగ్గైపోతూ ఆక్రోశాన్ని దిగమింగుకొనే అహ! నా పెళ్ళంట ! లోని అరగుండు పాత్రతో తెలుగు ప్రేక్షకుల దృష్టి అతనిపై పడింది. "అరగుండు వెధవా" అని కోటతో తిట్టించుకొన్న ఆ అరగుండు పాత్రే బ్రహ్మానందం, తన హాస్యనట విశ్వరూపాన్ని ప్రదర్శించేలా చేసింది. జంధ్యాల తను దర్శకత్వం వహిస్తున్న "చంటబ్బాయ్" సినిమా నిర్మాణ సమయంలో చిరంజీవికి పరిచయం చేయడం, తర్వాత "పసివాడి ప్రాణం"లో ఓ చిన్న పాత్ర వేయడం. ఇలా నలుగుతున్న రోజుల్లో ఆయన ఇచ్చిన అవకాశం అహ నా పెళ్ళంటలో అరగుండు పాత్ర. ఈ పాత్రతో బ్రహ్మానందం నటజీవితాన్ని మలుపు తిప్పేలా చేసిన దర్శకుడు జంధ్యాలను, అలాగే ఆ చిత్రంలో నటించే అవకాశం ఇచ్చిన ఆ చిత్ర నిర్మాత డాక్టర్ డి. రామానాయుడును, ఆ రోజుల్లో అన్ని విధాలా ప్రోత్సహించిన చిరంజీవిని ఎప్పటికీ మరువలేను అంటారు. ఈ చిత్రంలో వేసిన పాత్ర ఆనాటి నుంచి బ్రహ్మానందం నట జీవితంలో యేడాదికి 35 చిత్రాలకు తగ్గకుండా నటించేందుకు పాదులు తీయడం గమనార్హం.

ప్రజాదరణ పొందిన ఊత పదాలు
నీ యంకమ్మా (చిత్రం భళారే విచిత్రం చిత్త్రంలోని సంభాషణ)
పండగ చేసుకో (భిక్షగాడి పాత్ర ఆలీతో పోకిరి చిత్రంలో అర్థ రూపాయి దానం చేసి అనే సంభాషణ)
రకరకాలుగా ఉంది మాస్టారూ (నువ్వు నాకు నచ్చావ్ చిత్రం)
ఖాన్ తో గేమ్స్ ఆడకు... శాల్తీలు లేచిపోతాయి... (మనీ మనీ చిత్రం)
దొరికాడా ఏశెయ్యండి... (పట్టుకోండి చూద్దాం)
జఫ్ఫా (చాలా చిత్రాలలో)
ఇరుకుపాలెం వాళ్లంటే ఏకసెక్కాలుగా ఉందా? (ధర్మచక్రం)
నా పెర్ఫార్మెన్స్ మీకు నచినట్లైతే ఎస్సెమ్మెస్ చేయండి (దూకుడు)
నన్ను ఇన్వాల్వ్ చేయకండి రావు గారు (ఢీ)

కుటుంబం
బ్రహ్మానందం గారి భార్య పేరు లక్ష్మి. ఈ దంపతులకు ఇద్దరు కుమారులు గౌతం, సిద్ధార్థ్. ఒకరు ఎం. బి. ఏ మరొకరు బి.టెక్ పూర్తి చేశారు. గౌతమ్ కథానాయకుడిగా పల్లకిలో పెళ్ళికూతురు అనే చిత్రం వచ్చింది. బ్రహ్మానందం తండ్రికి శిల్పకళ తెలియడంతో ఆయనకు కూడా ఈ కళ కొద్దిగా అలవడింది. ఖాళీ సమయాల్లో బొమ్మలు కూడా గీస్తుంటాడు. తండ్రి నుంచే ఆయనకు పుస్తకాలు చదివే అలవాటు అబ్బింది.

అవార్డులు - సత్కారాలు
నటుడిగా గుర్తింపు నిచ్చిన అహ నా పెళ్లంట చిత్రమే 1987లో ఈయనకి తొలి నంది పురస్కారాన్ని కూడా సాధించిపెట్టింది. మనీ, అనగనగా ఒక రోజు, అన్న, వినోదం చిత్రాలకు కూడా నంది పురస్కారాలను పొందారు.
ఐదు కళాసాగర్ పురస్కారాలు
తొమ్మిది వంశీ బర్కిలీ పురస్కారాలు
పది సినీగోయర్స్ పురస్కారాలు
ఎనిమిది భరతముని పురస్కారాలు
ఒక్క ఫిలింఫేర్ పురస్కారము
రాజీవ్‌గాంధీ సద్భావనా పురస్కారం
ఆటా (అమెరికా), సింగపూర్, లండన్ డాకర్స్, అరబ్ ఎమిరేట్స్, ఆస్ట్రేలియా తెలుగు అసోసియేషన్స్ వారి సత్కారాలు, షోలాపూర్, ఢిల్లీ తెలుగు అకాడమీల నుంచి సన్మానాలు అందుకున్నారు.
విజయవాడ విశ్వబ్రాహ్మణ సంఘం వారు స్వర్ణ గండపెండేరాన్ని తొడిగి సత్కరించారు.
పద్మవాహన సంస్థ బంగారు పతకాన్ని బహూకరించింది.
సత్తెనపల్లి ఫ్రెండ్స్ క్లబ్‌వారు స్వర్ణహస్తకంకణాన్ని బహూకరించారు.
అచార్య నాగార్జున విశ్వవిద్యాలయం నుండి డాక్టరేటును అందుకున్నారు.
విఖ్యాత హస్యనటులయిన రేలంగి, రాజబాబు, చలం, అల్లు, సుత్తి వీరభద్రరావు పేరిట నెలకొల్పిన పురస్కారాలన్నీ బ్రహ్మానందం కైవసం చేసుకోవడం అరుదైన ఘటన!
‘హాస్య నట బ్రహ్మ’ అవార్డు (టీఎస్‌ఆర్‌ కాకతీయ లలిత కళాపరిషత్‌, 12.03.2018)

ఇతర విశేషాలు
'రేలంగి తన ప్యాంటూ షర్టూ మార్చుకొని బ్రహ్మానందం రూపంలో మళ్లీ తెరమీదికొచ్చాడ' ని కితాబులందు కొన్న నటుడు బ్రహ్మానందం
రెండు దశాబ్దాలుగా తన హాస్యనటనతో ఎన్నో మైలురాళన్లి అధిగమించి దాదాపు 745 చిత్రాల్లో నటించిన ఘనత వహించారు.
తక్కువ వ్యవధిలో అత్యధిక చిత్రాల్లో నటించిన నటుడిగా ఆయన తిరుగులేని రికార్డు నెలకొల్పడం విశేషం.
ప్రతిష్ఠాత్మకమైన గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో అత్యధిక సినిమాలు నటించినందుకు చోటు దక్కించుకున్న ఏకైక హాస్య నటులు.

- సేకరణ