సందడి సందడిగా విజ్ఞానోత్సవ్
- కృషి చేసిన వారికే ఉన్నత స్థానం
వైస్ చాన్స్లర్ ప్రొఫెసర్ పీ.నాగభూషణ్
- రెండోరోజు వైభవంగా కొనసాగిన విజ్ఞాన్ మహోత్సవ్–2కే24
విద్యార్థులతో ముచ్చటించి.. సందడి చేసిన సినీ తారలు
పోటాపోటీగా కొనసాగుతున్న పోటీలు
అలరించిన సాంస్కృతిక ప్రదర్శనలు
వివిధ రాష్ట్రాల నుంచి హాజరైన విద్యార్థులు
నేటి ముగింపు కార్యక్రమానికి గౌరవ అతిథులుగా ఇండియన్ నేషనల్ క్రికెట్ టీమ్ మాజీ సెలక్టర్, క్రికెటర్ ఎమ్మెస్కే ప్రసాద్, ఇండియన్ ఫిల్మ్ యాక్టర్ కిరణ్ అబ్బవరం, ఇండియన్ స్క్రీన్ రైటర్ బుర్రా సాయి మాధవ్
ఒకటి కాదు.. రెండు కాదు... ఏకంగా 75 ఈవెంట్లు. కనుచూపు మేర ఎటువైపు చూసినా విద్యార్థులు క్రీడా సంబరాల్లో మునిగిపోయారు. బాస్కెట్బాల్, ఖోఖో, ఫుట్బాల్, టేబుల్ టెన్నిస్, చెస్, టెన్నికాయిట్, అథ్లెటిక్స్... ఇలా ఒకటేమిటి అనేక విభాగాల్లో విద్యార్థులు అద్భుత ప్రదర్శనలతో ఉర్రూతలూగించారు. ఒకరితో ఒకరు నువ్వా నేనా అన్నట్లు పోటీపడి విజయాలు సాధిస్తున్నారు. చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్స్ యూనివర్సిటీలో జరుగుతున్న జాతీయస్థాయి విజ్ఞాన్ మహోత్సవ్–2కే24 పోటీలు విద్యార్థులను ఆసాంతం అబ్బురపరిచింది.
జీవితంలో కష్టపడి పనిచేయడంతో పాటు బాగా కృషి చేసిన వారే ఉన్నత స్థానాలను అధిరోహిస్తారని వర్సిటీ వైస్ చాన్స్లర్ ప్రొఫెసర్ పీ.నాగభూషణ్ అన్నారు. చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్స్ యూనివర్సిటీలో జాతీయ స్థాయి విజ్ఞాన్స్ మహోత్సవ్ కార్యక్రమం రెండో రోజు శుక్రవారం సందడి సందడిగా సాగింది. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన వైస్ చాన్స్లర్ ప్రొఫెసర్ పీ.నాగభూషణ్ మాట్లాడుతూ మీ కలల సాకారానికి అంకితభావంతో కృషి చేస్తే ఉన్నతంగా ఎదిగే శక్తి సామర్థ్యాలు మీలో ఉన్నాయని అన్నారు. ఇది సాధించలేనేమో అనే భయం, సందేహాలకు జీవితంలో ఎప్పుడూ కూడా తావివ్వొద్దని సూచించారు. డబ్బుతో సాధించలేనివి ఎన్నో ప్రేమ, మన్నింపు, ధైర్యంతో సాధించవచ్చని పేర్కొన్నారు. క్రీడలు శారీరక ఉల్లాసానికే కాకుండా మానసిక ఉల్లాసానికి కూడా దోహదపడుతాయని అన్నారు. శారీరక, మానసిక ధృఢత్వంతో పాటు స్నేహ సంబంధాలు మెరుగుకు క్రీడలు దోహదం చేస్తాయన్నారు. చదువుతో పాటు క్రీడలు, సృజనాత్మకత అంశాలపై ప్రావీణ్యం సాధించినప్పుడే సంపూర్ణ విద్యార్థులు అవుతారని పేర్కొన్నారు. అనంతరం నేటి ముగింపు కార్యక్రమానికి గౌరవ అతిథిలుగా ఇండియన్ నేషనల్ క్రికెట్ టీమ్ మాజీ సెలక్టర్, క్రికెటర్ ఎమ్మెస్కే ప్రసాద్, ఇండియన్ ఫిల్మ్ యాక్టర్ కిరణ్ అబ్బవరం, ఇండియన్ స్క్రీన్ రైటర్ బుర్రా సాయి మాధవ్లు రానున్నారని తెలియజేసారు.
పోటాపోటీగా క్రీడలు
జాతీయ స్థాయి విజ్ఞాన మహోత్సవ్లో భాగంగా నిర్వహిస్తున్న పోటీల్లో విద్యార్థులు నువ్వా నేనా అన్నట్లు పోటీపడుతున్నారు. అథ్లెటిక్స్లో భాగంగా 100 మీటర్లు, 200 మీటర్లు, 400 మీటర్లు, 800 మీటర్ల పరుగు పందేలను నిర్వహించారు. వీటితో పాటు వాలీబాల్, బ్యాడ్మింటన్, కబడ్డీ, ఖోఖో, ఫుట్బాల్, టేబుల్ టెన్నిస్, చెస్ పోటీలను నిర్వహించారు. విజ్ఞాన్ మహోత్సవ్లో భాగంగా నిర్వహిస్తున్న పోటీలన్నీ కూడా సెమీ ఫైనల్స్కు చేరుకున్నాయి. నేడు ఫైనల్స్ మ్యాచ్లు జరగనున్నాయి.
ఆకట్టుకున్న ప్రదర్శనలు
తరగతి గదుల్లో పుస్తకాలతో కుస్తీ పడుతున్న విద్యార్థుల్లో అంతర్లీనంగా దాగిన కళలు, సృజనాత్మక నైపుణ్యాలకు పదును పెడుతూ మూడు రోజుల పాటు జరగనున్న పోటీల్లో రెండోరోజు వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన విద్యార్థులు సోలో సాంగ్స్, లఘు నాటికలు, రెట్రో డాన్స్ ప్రదర్శనలతో ఆకట్టుకున్నారు. కళాకారులు పలు నృత్య రూపకాలకు అనుగుణంగా నర్తించి మంత్రముగ్ధుల్ని చేశారు. ముఖ్యంగా జానపద, శాస్త్రీయ నృత్య ప్రదర్శనలు ఓలలాడించాయి. వీటితోపాటు కల్చరల్స్, లిటెరరీ, ఫైన్ ఆర్ట్స్, ఫ్యాషన్ స్కెచ్చింగ్ పోటీల్లో విద్యార్థులు సత్తాచాటారు. జాతీయ స్థాయి విజ్ఞాన్ మహోత్సవ్లో భాగంగా ఏర్పాటు చేసిన స్టాళ్లు విద్యార్థులను ఆకర్షించాయి. కార్యక్రమంలో విజ్ఞాన్స్ విద్యా సంస్థల చైర్మన్ డాక్టర్ లావు రత్తయ్య, వైస్ చాన్స్లర్ ప్రొఫెసర్ పీ.నాగభూషణ్, రిజిస్ట్రార్ డాక్టర్ ఎంఎస్ రఘునాథన్, ఆయా విభాగాల డీన్లు, అధిపతులు, విద్యార్థులు పాల్గొన్నారు.