నాటకరంగంలో మహానటి సావిత్రి అవార్డు ప్రకటిస్తే తొలిగా శ్రీజ కి ఇవ్వమని చెప్తాను -
 సినీ దర్శకులు వి.యన్. ఆదిత్య
టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్:
ఈరోజుల్లో నిజాలు మాట్లాడడం చాలా డేంజర్, అలాంటిది సమాజంలో చూసిన వ్యక్తులు, ఎదుర్కొన్న పరిస్థితుల ఆధారంగా కవితల బాణాలు సంధించడానికి
చాలా ధైర్యం కావాలి, 
డా. శ్రీజ సాదినేని చేసిన అలాంటి సాహసం విజయం సాధించాలని ప్రముఖ సినీ దర్శకులు వి.యన్.ఆదిత్య అన్నారు. సినీ నటి, రచయిత్రి డా.శ్రీజ సాదినేని రచించిన "శ్రీజ కోట్స్" నిప్పు లాంటి నిజాలు పుస్తక ఆవిష్కరణ కార్యక్రమం శనివారం హైదరాబాద్ చిక్కడపల్లి శ్రీ త్యాగరాయ గానసభ, గుండవరపు హనుమంతరావు కళా వేదికలో ఘనంగా జరిగింది. 
ఈ కార్యక్రమానికి సినీ దర్శకులు వి. యన్. ఆదిత్య ముఖ్య అతిథిగా హాజరయ్యారు. పుస్తకాన్ని ఆవిష్కరించి మొదటి కాపీని వర్ధమాన సినీ దర్శకులు గౌరీ నాయుడుకు అందజేశారు. ఈ సందర్భంగా ఆదిత్య మాట్లాడుతూ ... 
డా.శ్రీజ నటించిన నేషనల్ హైవే అనే నాటికలో స్వతంత్ర అనే పాత్రను పోషించారు. ఆమె నటనకు థియేటర్ మొత్తం స్టాండింగ్ ఓవేషన్ చేశారు. క్లైమాక్స్ లో అందరినీ ఏడిపించేసింది.నాటిక మర్చిపోవచ్చు కానీ ఆక్షణం ప్రేక్షకుడుగా పొందిన అనుభూతి ఎప్పటికీ మర్చిపోలేము.తెలుగు రాష్ట్రాలలో ఏ ప్రభుత్వం అయినా మహానటి సావిత్రి అవార్డు ప్రకటిస్తే ఫస్ట్ ఆ అవార్డు ఆవిడకే ఇవ్వాలి అని నేను చెప్తాను.
గొప్ప నటిగా తనకు తెలిసిన శ్రీజ కవయిత్రిగా, రచయిత్రిగా కూడా ప్రతిభను కనపర్చడం చూసి ఆశ్చర్యపోయానన్నారు. అభిసారిక అనే ప్రేమ కవితా సంపుటి, 
త్రినయని  పేరుతో మూడు విభిన్న నాటికలు, 
నిప్పు లాంటి నిజాలు అంటూ నిత్య జీవిత సత్యాలు ఇన్ని రచనలు చేసిన తను ఎంతో అభినందనీయురాలు.
ఇలా జీవితంలో తను అనుభవించిన కష్టాలు, ఎదుర్కొన్న పరిస్థితులు, రచయిత్రిగా తన ప్రయాణం అన్నీ కలగలిపి వయసుకు మించిన అనుభవం సంపాదించింది కాబట్టి తను రాస్తే అవి కచ్చితంగా నిప్పు లాంటి నిజాలే అవుతాయని ఆదిత్య అన్నారు.
దైనందిన జీవితంలో అడుగడుగునా ఎదురయ్యే సమస్యల నుంచి ఉపశమనం కోసం ఈ పుస్తకం చదివితే అది వారికి మంచి మెడిసిన్ లా పనిచేస్తుందని, నిరాశా నిస్పృహలకు లోనై మానసికంగా బాధ పడి వారికి ఈ పుస్తకం చక్కని ప్రోత్సాహాన్ని అందించి ముందుకు నడిపిస్తుంది అనడంలో అతిశయోక్తి లేదని, ఇలాంటి ఇంకా ఎన్నో గొప్ప రచనలు చేసి మరిన్ని విజయాలను సొంతం చేసుకోవాలని డా. శ్రీజ సాదినేనిని ఆయన అభినందించారు. 
మనిషి మనసు లోతుల్లోని భావాలు, జీవిత సత్యాల గురించి చాలా బాగా ఈ పుస్తకంలో డా. శ్రీజ రాశారని దర్శకులు గౌరీ నాయుడు అన్నారు.
ఈ కార్యక్రమంలో సినీ దర్శకులు గౌరీ నాయుడు, శ్రీ జయా ఆర్ట్స్ హైదరాబాద్ వైస్ ప్రెసిడెంట్ కే. రత్నయ్య, జనరల్ సెక్రటరీ శశిధర్ ఘణపురం, అవినాష్ యాదవ్, వేదాంతం రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. ఆవిష్కరణకు విచ్చేసి ఆశీస్సులు అందించిన అందరికీ డా.శ్రీజ సాదినేని కృతజ్ఞతలు తెలిపారు.