యోగాతోనే ఆరోగ్యకరమైన జీవితం
- ఏపీలోని భారత్ స్వాభిమాన్ ట్రస్ట్ వైస్ ప్రెసిడెంట్ డీ.దుర్గా రావ్
_ విజ్ఞాన్స్లో ఘనంగా 10వ ఇంటర్నేషనల్ యోగా డే ఉత్సవం
టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్:
ఆరోగ్యకరమైన జీవితానికి యోగా ఎంతో సహాయపడుతుందని ఏపీలోని భారత్ స్వాభిమాన్ ట్రస్ట్ వైస్ ప్రెసిడెంట్ డీ.దుర్గా రావ్ అన్నారు. చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్స్ యూనివర్సిటీలోని ఫిజికల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో 10వ ఇంటర్నేషనల్ యోగా డేను ఈ సంవత్సరం ‘‘యోగా ఫర్ ఉమెన్ ఎంపవర్మెంట్’’ అనే ఇతివృత్తంతో నిర్వహించారు. యోగా డేను పురస్కరించుకుని నిర్వహిస్తున్న వారోత్సవాల్లో భాగంగా కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఏపీలోని భారత్ స్వాభిమాన్ ట్రస్ట్ వైస్ ప్రెసిడెంట్ డీ.దుర్గా రావ్ మాట్లాడుతూ ప్రస్తుతం మానసిక ఒత్తిడి, సమస్యలు లేని జీవితం లేదంటే అతిశయోక్తి కాదన్నారు. పని ఒత్తిడి, ఆర్థిక పరమైన సమస్యలు, ఇతర ఇబ్బందుల కారణంగా ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయన్నారు. ప్రతిరోజు కనీసం ఒక అరగంట అయినా శారీరక శ్రమ చేయాలని విద్యార్థులకు పిలుపునిచ్చారు. అందుకు యోగా చక్కని మార్గమని విద్యార్థులకు తెలియజేసారు. చాలా మందికి వారి అస్తవ్యస్తమైన బిజీ జీవితాల నుంచి యోగా ఉపశమనాన్ని ఇస్తుందని పేర్కొన్నారు. యోగా చేయడం వల్ల శరీరానికి నూతనోత్సాహం కలుగుతుందన్నారు. మనసు, శరీరం, ఆత్మను నియంత్రించడంలో యోగా బాగా సహాయపడుతుందన్నారు. కార్యక్రమానికి గౌరవ అతిథిగా హాజరైన ఏపీ హైకోర్టు అడ్వకేట్ జీవీఆర్ క్రిష్ణ ప్రసాద్ మాట్లాడుతూ యోగా అనేది ఒక శక్తివంతమైన మైండ్ఫుల్నెస్ సాధనని పేర్కొన్నారు. యోగా ఒత్తిడిని తగ్గించి ప్రశాంతంగా ఉండేటట్లు చేస్తుందన్నారు. యోగా చేయడం వల్ల రక్తపోటు అదుపులోకి వస్తుందన్నారు. యోగ శ్వాసక్రియ శక్తిని కూడా మెరుగుపరుస్తుందన్నారు. యోగ సాధన సాగదీసినట్లు అనిపించవచ్చు కానీ శరీరానికి మంచి అనుభూతి అందించి, కదిలే విధానంలో చాలా మార్పు చూపుతుందన్నారు. మరో ముఖ్య అతిథిగా హాజరై ఇండస్ట్రియలిస్ట్ వీఆర్ శ్రీలక్ష్మి మాట్లాడుతూ క్రమం తప్పకుండా యోగా సాధన చేయడం వలన బరువు తగ్గడం, ఒత్తిడిని తగ్గించుకోవడం సాధ్యమవుతుందన్నారు. విద్యార్థులందరూ అష్టాంగ యోగాను త్రికరణ శుద్ధిగా సాధన చేసినట్లైతే మంచి రాజయోగంతో జీవిస్తారని తెలియజేసారు. కార్యక్రమంలో విజయవాడలోని యోగాసన స్పోర్ట్స్ స్టేట్ సెక్రటరీ పీ.ప్రేమ్ కుమార్, వైస్ చాన్స్లర్ ప్రొఫెసర్ పీ.నాగభూషణ్, రిజిస్ట్రార్ డాక్టర్ ఎంఎస్ రఘునాథన్, ఆయా విభాగాల డీన్లు, అధిపతులు, విద్యార్థులు పాల్గొన్నారు.