విజ్ఞాన్స్ వర్సిటీ వీసీకు ఎన్సీసీ విభాగంలో గౌరవ కల్నల్ ర్యాంక్
చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్స్ యూనివర్సిటీ వైస్ చాన్స్లర్ ప్రొఫెసర్ పీ.నాగభూషణ్కు ఎన్సీసీ విభాగంలో గౌరవ కల్నల్ ర్యాంక్ను అందిస్తున్నట్లు న్యూఢిల్లీలోని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా– మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ శుక్రవారం ప్రకటించింది. ఇందుకు సంబంధించిన సర్టిఫికెట్ను, గెజిట్ నోటిఫికేషన్ను త్వరలోనే ఆయనకు అందజేస్తామని వెల్లడించింది. విజ్ఞాన్స్ యూనివర్సిటీ అకడమిక్ ఫ్రేమ్వర్క్లో ఎన్సీసీను ఏకీకృతం చేయడం, మౌలిక సదుపాయాలను మెరుగుపరచి విద్యార్థుల్లో క్రమశిక్షణ, స్నేహభావం, నిబద్ధత, సమగ్ర అభివృద్ధికై చేస్తున్నటువంటి కృషికి గాను ఎన్సీసీ విభాగంలో గౌరవ కల్నల్ ర్యాంక్ను అందిస్తున్నామని వెల్లడించింది. యూనివర్శిటీలో ఎన్సీసీ కార్యకలాపాలను ఎక్కువగా నిర్వహించటంలో ఆయన విశేషమైన నిబద్ధతను ప్రదర్శించారని తెలియజేసింది. ఎన్సీసీ మరియు ఎన్సీసీయేతర క్యాడెట్లకు 20 క్రెడిట్లను అందించే ఎన్సీసీ మైనర్ ప్రోగ్రామ్ను ప్రవేశపెట్టడం ఆయన సాధించిన విజయాలలో అతి ముఖ్యమైనది. ఎన్సీసీ ట్రైనింగ్ ప్రాముఖ్యతను గుర్తిస్తూ అకడమిక్ కరిక్యులమ్లో ఇంటిగ్రేటెడ్ డిజాస్టర్ మేనేజ్మెంట్తో పాటు ఎస్ఎస్బీ ట్రైనింగ్ను ఎన్సీసీ మైనర్ కోర్సులో విలీనం చేసారని పేర్కొంది. ఈయన నాయకత్వంలో కఠినమైన శిక్షణ, క్యాడెట్లలో క్రమశిక్షణ, స్నేహ భావాన్ని పెంపొందించడం కోసం విశ్వవిద్యాలయంలో క్యాంపుల నిర్వహణకు అనువైన వాతావరణం ఏర్పాటుకు కృషి చేశారని వెల్లడించింది. గడిచిన విద్యా సంవత్సరంలో ఇక్కడే రెండు శిబిరాలకు క్యాంపు స్థలాన్ని అందించడంలో ఆయన పాత్ర వెలకట్టలేనిదని తెలియజేసింది. రిపబ్లిక్ డే క్యాంప్, తలసైనిక్ క్యాంప్, ఆర్మీ అటాచ్మెంట్ క్యాంప్తో పాటు ఇతర జాతీయ–స్థాయి పోటీలలో విద్యార్థులు చురుకుగా పాల్గొనేలా క్యాడెట్లను ప్రేరేపించడంలో వైస్ ఛాన్సలర్ కీలకపాత్ర పోషించారని తెలియజేసింది. ఈ క్యాంపుల వల్ల విద్యార్థుల్లో నైపుణ్యాలు పెరగడమే కాకుండా విజ్ఞాన్స్ యూనివర్సిటీకి మంచి గుర్తింపు వచ్చింది. ఎన్సీసీ యూనిట్ల విశిష్టతను గుర్తించి యూనివర్శిటీ పరిధిలో కొత్త యూనిట్లను పెంచేందుకు కృషి చేశారని వెల్లడించింది. ఈ విస్తరణ పరిధిని పెంచడం వలన ఎక్కువ మంది విద్యార్థులు ఎన్సీసీలో చేరడానికి అవకాశం లభిస్తుందన్నారు. ఎన్సీసీ కోర్సును యాడ్–ఆన్ డిప్లొమాగా ప్రవేశపెట్టారని తెలియజేసింది. ఈ సందర్భంగా విజ్ఞాన్స్ యూనివర్సిటీ వైస్ చాన్స్లర్ ప్రొఫెసర్ పీ.నాగభూషణ్ మాట్లాడుతూ ఎన్సీసీ విభాగంగా గౌరవ కల్నల్ ర్యాంక్ లభించడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఈ ర్యాంక్ లభించడం వలన ఎన్సీసీ కార్యకలాపాలను నిర్వహించడంలో తన బాధ్యత మరింత పెరిగిందన్నారు. ఎన్సీసీ విద్యార్థులకు ఉపయోగపడేలా సరికొత్త ప్రోగ్రామ్లు డిజైన్ చేయటంతో పాటు మౌలిక వసతులు మెరుగుపరచడంలో మరింత కృషి చేస్తానన్నారు. గౌరవ కల్నల్ ర్యాంక్ సాధించిన విజ్ఞాన్స్ యూనివర్సిటీ వైస్ చాన్స్లర్ ప్రొఫెసర్ పీ.నాగభూషణ్కు విజ్ఞాన్స్ విద్యాసంస్థల చైర్మన్ డాక్టర్ లావు రత్తయ్య, వైస్ చైర్మన్ లావు శ్రీకృష్ణదేవరాయలు, రిజిస్ట్రార్ డాక్టర్ ఎంఎస్ రఘునాథన్, ఆయా విభాగాల డీన్లు, అధిపతులు, అధ్యాపక సిబ్బంది శుభాకాంక్షలు తెలియజేశారు.