సామాజిక మాధ్యమాల వలన కాలం వృథా


సామాజిక మాధ్యమాల వలన కాలం వృథా
- తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ డాక్టర్ గురిజాల రాధారాణి
టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్:
తెనాలి: 20-07-2024: సామాజిక మాధ్యమాలు, సెల్ఫోన్లతో కాలాన్ని వృథా చేయకుండా, సామాన్య జీవితాన్ని గడుపుతూ ఆదర్శంగా జీవించడం బాల్యం నుండి అలవరచుకోవాలని తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ డాక్టర్ గురిజాల రాధారాణి అన్నారు. కీ.శే. మొవ్వా విజయలక్ష్మి స్మారక సేవా సమితి ఆధ్వర్యంలో స్థానిక కొత్తపేటలోని తెనాలి రామకృష్ణ కవి కళాక్షేత్రలో శనివారం ఉదయం సమితి వ్యవస్థాపకుడు మొవ్వా సత్యనారాయణ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో మొవ్వా విజయలక్ష్మి స్మారక పురస్కారాన్ని సబ్ కలెక్టర్ ప్రఖరైన్, మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్ చేతులమీదుగా జస్టిస్ గురిజాల రాధారాణి అందుకుని అనంతరం జరిగిన సభలో ఆమె 'విద్యార్థులు-భవిష్యత్ సవాళ్ళు' అనే అంశంపై ప్రసంగించారు. సభకు సమితి వ్యవస్థాపకులు మొవ్వా సత్యనారాయణ అధ్యక్షత వహించారు. రాధారాణి తన ప్రసంగాన్ని కొనసాగిస్తూ మనం చదివే చదువు వినూత్న ఆలోచనా ధోరణి నేర్పేలా ఉండాలి అన్నారు. చదువంటే మార్కులు, ఉద్యోగం కోసం కాదు. మానసిక వికాసం కోసం చదువుకోవాలి. ఉద్యోగం అవసరం. కానీ అదే పరమావధి కాదు. సాధారణంగా ఆడపిల్లలు క్రీడలకు దూరంగా ఉంటుంటారు. నేను బాలికను అనే న్యూనతా భావం ఏ కోశానా రాకుండా క్రీడల్లో కూడా రాణించాలి. తల్లిదండ్రులకు ఇంటి పనులలో ప్రతి విద్యార్థి సాయపడుతూ కుటుంబ, సమాజ విషయాలపట్ల అవగాహన పెంచుకోవాలి. చదువుతోపాటు నైతిక విలువలను నేర్పే ఉపాధ్యాయులు నేటి సమాజానికి అవసరం. అటువంటి ఉపాధ్యాయులను విద్యార్థులు జీవితాంతం గుర్తుంచుకుంటారు. వందశాతం కష్ట పడకుండా ఏదీ సాధించలేరని జస్టిస్ రాధారాణి అన్నారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న తెనాలి సబ్ కలెక్టర్ ప్రఖరైజైన్ మాట్లాడుతూ జీవితంలో అపజయాలు వస్తుంటాయి. వాటిని పాఠాలుగా నేర్చుకుంటూ దీర్ఘకాలిక లక్ష్యాలను సాధించే వైపు దృష్టి సారించాలి అన్నారు. పోటీపరీక్షలకు సంబంధించిన విషయాలలో అనుభవజ్ఞుల సలహాలు, సూచనలు తీసుకోవడం, విజ్ఞాన విషయలను చర్చించడం వల్ల విజయం పొందవచ్చని ప్రఖరైన్ అన్నారు. మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ మంచి, చెడులను విశ్లేషించుకుంటూ నైతిక విలువలతో కూడిన గుణగణాలతో విద్యను అభ్యసిస్తే బంగారు భవితకు మార్గం సుగమమౌతుందన్నారు. సభానంతంరం జస్టిస్ రాధారాణి, శీలం గాంధీ దంపతులకు ఘనంగా సత్కరించి శ్రీమతి మొవ్వా విజయలక్ష్మి స్మారక పురస్కారాన్ని అందించారు. ఈ కార్యక్రమంలో చైతన్య వేదిక అధ్యక్షుడు డాక్టర్ పాటిబండ్ల దక్షిణామూర్తి, హైదరాబాద్ రవాణాశాఖ మాజీ అడిషనల్ కమీషనర్ శీలం గాంధీ, అమృతసాయి ఇంజినీరింగ్ కళాశాల కరస్పాండెంట్ కె. రామమోహనరావు తదితరులు ప్రసంగించారు. అనంతరం గత విద్యా సంవత్సరం తెనాలి మున్సిపల్ పాఠశాలలతో పాటు తెనాలి మండలంలోని జిల్లాపరిషత్ పాఠశాలల్లో విద్యాభ్యాసం చేసి 550కు పైగా మార్కులు సాధించిన 26 మంది టెన్త్ విద్యార్థులకు ఒక్కొక్కరిని రూ. 5 వేల నగదును బహూకరించి, జ్ఞాపికతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో న్యాయమూర్తి రాజశేఖర్, ఏఎస్ఎన్ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ కె. రామ్ చంద్ , మహమ్మద్ ఖుద్దూస్, జి. పూర్ణచంద్, కటకం ప్రసాద్, వెంకట్, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.