భవిష్యత్లో ఈవీ ఇండస్ట్రీలో మిలియన్ ఉద్యోగాలు
- ఎన్ఐటీ ఏపీ అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ వీ.సందీప్
భవిష్యత్లో ఈవీ ( ఎలక్ట్రిక్ వెహికల్) ఇండస్ట్రీలో మిలియన్ ఉద్యోగాలు క్రియేట్ చేయబడుతాయని ఎన్ఐటీ ఏపీ అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ వీ.సందీప్ అన్నారు. చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్స్ లారా ఇంజినీరింగ్ కళాశాలలోని ఈఈఈ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో ఏఐసీటీఈ– వాణి ( వైబ్రంట్ అడ్వోకసీ ఫర్ అడ్వాన్స్మెంట్ అండ్ నర్చరింగ్ ఆఫ్ ఇండియన్ ల్యాంగ్వేజెస్) ఆర్థిక సహకారంతో ‘‘విద్యుదీకరణ చలనశీలత: ఎలక్ట్రిక్ వాహనాలతో భవిష్యత్ను రూపొందించడం’’ అనే అంశంపై మూడు రోజుల పాటు నిర్వహించనున్న వర్క్షాప్ను మంగళవారం ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎన్ఐటీ ఏపీ అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ వీ.సందీప్ మాట్లాడుతూ భవిష్యత్ అంతా ఎలక్ట్రిక్ వెహికల్స్దేనని పేర్కొన్నారు. రెన్యూవబుల్ ఎనర్జీ మరియు ఎలక్ట్రిక్ వెహికల్స్ రంగాలలో విద్యార్థులకు అవకాశాలు మెండుగా ఉన్నాయన్నారు. ఎలక్ట్రికల్ వెహికల్స్ డిజైనింగ్ను ఎలక్ట్రికల్ మరియు మెకానికల్ విభాగాలు కలిసి పని చేయాలన్నారు. ఇప్పటికే సెంట్రల్ గవర్నమెంట్ ఎలక్ట్రికల్ వెహికల్స్ను కొనే వారికి రాయతీలు ఇవ్వడం ద్వారా ప్రోత్సహిస్తుందన్నారు. ప్రస్తుతం ఇండస్ట్రీలకు ఎలక్ట్రిక్ వెహికల్స్లలో వినియోగించే టెక్నాలజీలపైన అనుభవం కలిగిన వారు తక్కువగా ఉండటం ప్రధాన సమస్యగా మారిందన్నారు. కాబట్టి విద్యార్థులందరూ ఎలక్ట్రిక్ వెహికల్స్లో వినియోగించే టెక్నాలజీల మీద పట్టు సాధించినట్లైతే ఉజ్వల భవిష్యత్ ఉంటుందని తెలియజేసారు. విదార్యులు కేవలం ఉద్యోగాలకే పరిమితం అవ్వకుండా స్టార్టప్స్ను మొదలుపెట్టి ఎంటర్ప్రెన్యూర్స్గా కూడా ఎదగాలన్నారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన విజ్ఞాన్స్ విద్యాసంస్థల చైర్మన్ డాక్టర్ లావు రత్తయ్య మాట్లాడుతూ బ్యాటరీ యొక్క పనితనం మరియు స్టోరేజ్ గురించి విద్యార్థులకు వివరించారు. బ్యాటరీ నుంచి వచ్చేటువంటి వ్యర్థాలను విసర్జించడం ఒక సవాల్ అని తెలిపారు. భవిష్యత్తులో హైడ్రోజన్తో పనిచేసే వాహనాలు వినియోగంలోకి వచ్చే అవకాశం ఉందని తెలిపారు. ఎలక్ట్రిక్ వెహికల్స్ పొల్యూషన్ ఫ్రీ మరియు నాయిస్ లెస్ అయినప్పటికి డిజైనింగ్ అండ్ లైఫ్ అఫ్ బ్యాటరీ మరియు లైట్ వెయిట్ మెటీరియల్స్ను ఎంచుకోవటం వంటి అంశాలపై విద్యార్థులు దృష్టి పెట్టాలన్నారు. రాబోవు 50 సంవత్సరాలలో విద్యుత్ వాహనాలకు సంబంధించి మరింత సాంకేతికత అందుబాటులోకి వస్తుందని తెలియచేసారు. కార్యక్రమంలో విజ్ఞాన్ విద్యాసంస్థల అధినేత డాక్టర్ లావు రత్తయ్య, కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ కే. ఫణీంద్ర కుమార్, ఆయా విభాగాల డీన్లు, వివిధ విభాగాధిపతులు, రీసెర్చ్ స్కాలర్స్ మరియు అధ్యాపకులు పాల్గొన్నారు.