విజ్ఞాన్స్ వర్సిటీ లైబ్రేరియన్కు అయ్యంకి వెలగా పురస్కారం
చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్స్ యూనివర్సిటీ ప్రధాన గ్రంథాలయ అధికారిణి ఆచంట రజనీకుమారికు గ్రంథాలయ పితామహుడు, పద్మశ్రీ అయ్యంకి వెంకటరమణయ్య, గ్రంథాలయ గాంధీ డాక్టర్ వెలగా వెంకటప్పయ్యల పేర్లతో ప్రతిష్టాత్మకంగా ఇచ్చే గ్రంథాలయ పురస్కారం అందుకున్నారని వర్సిటీ వైస్ చాన్స్లర్ ప్రొఫెసర్ పీ.నాగభూషణం గురువారం తెలిపారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన అభినందన కార్యక్రమంలో వీసీ మాట్లాడుతూ అన్నమయ్య సేవా సమితి ఆధ్వర్యంలో గుంటూరులోని బృందావన్ గార్డెన్స్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి డాక్టర్ జస్టిస్ కేజీ శంకర్, డాక్టర్ ఆరేటి కృష్ణకుమారీలు చేతుల మీదుగా గ్రంథాలయ పురస్కారంతో పాటు రూ.10 వేల నగదు బహుమతిని అందుకున్నారని వెల్లడించారు. ఆచంట రజనీకుమారి గడిచిన 28 సంవత్సరాలుగా లైబ్రేరియన్గా ఎంతో విలువైన సేవలు అందించారని, వర్సిటీలో డిజిటల్ లైబ్రరీను ఏర్పాటు చేయడంతో పాటు ఎప్పటికప్పుడు విద్యార్థులు, రీసెర్చ్ స్కాలర్స్, అధ్యాపకులకు అవసరమైన పుస్తకాలను, పరిశోధన పత్రాలను అందజేయడంలో చేసిన కృషికి గాను ఈ పురస్కారం లభించిందన్నారు. ఎన్టీర్ విజ్ఞాన్స్ వర్సిటీ లైబ్రరీలో 1,15,000 పుస్తకాలు, 2 లక్షల ఈ–బుక్స్ అందుబాటులోకి తీసుకువచ్చిందన్నారు. ఏపీఎల్ఏ శాశ్వత సభ్యురాలిగా గుర్తింపు పొందటంతో పాటు అనేక విశ్వవిద్యాలయాల్లో జరిగిన జాతీయ, అంతర్జాతీయ సదస్సుల్లో పాల్గొని గ్రంథాలయ అభివృద్ధిపై అనేక పత్రాలను సమర్పించారని తెలియజేసారు. అంతేకాకుండా యూనివర్సిటీలో ఒక జాతీయ, అంతర్జాతీయ కాన్ఫరెన్స్లు, 4 జాతీయ వర్క్షాప్లు కూడా నిర్వహించారని వెల్లడించారు. అయ్యంకి వెలగా పురస్కారం అందుకున్న ఆచంట రజనీకుమారి మాట్లాడుతూ పద్మశ్రీ అయ్యంకి వెంకటరమణయ్య, గ్రంథాలయ గాంధీ డాక్టర్ వెలగా వెంకటప్పయ్యల పేర్ల మీదుగా ఇచ్చే గ్రంథాలయ పురస్కారానికి ఎంపిక చేసిన కమిటీ సభ్యులకు కృతజ్ఞతలు తెలియజేసారు. ఈ పురస్కారాన్ని అందుకోవడం పట్ల చాలా సంతోషంగా ఉందన్నారు. ఈ పురస్కారం నా మీద మరింత బాధ్యతను పెంచడంతో పాటు గ్రంథాలయాల అభివృద్ధికి మరింత కృషి చేస్తానని పేర్కొన్నారు. గ్రంథాలయ సేవలను మరింత చేరువ చేస్తానని హామీనిచ్చారు. అనంతరం గ్రంథాలయ పురస్కారం అందుకున్న ఆచంట రజనీకుమారిను విజ్ఞాన్స్ విద్యాసంస్థల చైర్మన్ డాక్టర్ లావు రత్తయ్య ప్రత్యేకంగా అభినందించారు. కార్యక్రమంలో విజ్ఞాన్స్ వర్సిటీ వైస్ చాన్స్లర్ ప్రొఫెసర్ పీ.నాగభూషణ్, రిజిస్ట్రార్ డాక్టర్ ఎంఎస్ రఘునాథన్, ఆయా విభాగాల డీన్లు, అధిపతులు, లైబ్రరీ సిబ్బంది పాల్గొన్నారు.