విజ్ఞాన్స్ వర్సిటీకు ప్రతిష్టాత్మక అబెట్ అక్రిడిటేషన్
చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్స్ యూనివర్సిటీకు ప్రతిష్టాత్మక యూఎస్ఏ బేస్డ్ అబెట్ (అక్రిడిటేషన్ బోర్డ్ ఫర్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ) అక్రిడిటేషన్ లభించిందని వర్సిటీ వైస్ చాన్స్లర్ కల్నల్, ప్రొఫెసర్ పీ.నాగభూషణ్ శుక్రవారం తెలిపారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ దేశంలో కేవలం 12 యూనివర్సిటీలకు మాత్రమే అబెడ్ అక్రిడిటేషన్ ఉందని, అందులో విజ్ఞాన్స్ యూనివర్సిటీ కూడా ఒకటని తెలియజేసారు. రెండు తెలుగు రాష్ట్ర్రాలలో అబెట్ అక్రిడిటేషన్ను సాధించిన మొట్ట మొదటి యూనివర్సిటీగా విజ్ఞాన్ నిలిచిందన్నారు. యూనివర్సిటీలోని 5 బ్రాంచ్లకు (సీఎస్ఈ, ఈఈఈ, ఈసీఈ, మెకానికల్, బయోటెక్నాలజీ) అబెట్ అక్రిడిటేషన్ 6 సంవత్సరాల పాటు లభించిందని వెల్లడించారు. అమెరికా నుంచి వచ్చిన 10 మంది సభ్యులతో కూడిన తనిఖీ బృందం యూనివర్సిటీలో మూడు రోజుల పాటు తనిఖీ నిర్వహించి అక్రిడిటేషన్ను అందించిందన్నారు. అబెట్ అక్రిడిటేషన్ వలన∙విదేశాలలో ఉన్నత విద్యతో పాటు ఉపాధి అవకాశాలు బాగా మెరుగవుతాయని తెలియజేసారు. వీటితో పాటు విదేశాలలో ఉన్న యూనివర్సిటీలతో విద్యార్థులకు ట్రైనింగ్ ప్రోగ్రామ్స్, ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్స్, అవగాహన ఒప్పందాలు కుదుర్చుకోవడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయన్నారు. అబెట్ అక్రిడిటేషన్ ఉన్న యూనివర్సిటీలకు ఎప్పటికప్పడు సెల్ఫ్ అసెస్మెంట్తో పాటు కంటిన్యూస్ ఇంప్రూవ్మెంట్ ఉంటుందని పేర్కొన్నారు. యూఎస్ఏ బేస్డ్ అబెట్ అక్రిడిటేషన్ పొందడంలో కృషి చేసిన ఐక్యూఏసీ సిబ్బందిని విజ్ఞాన్స్ విద్యాసంస్థల చైర్మన్ డాక్టర్ లావు రత్తయ్య, వైస్ చాన్స్లర్ కల్నల్, ప్రొఫెసర్ పీ.నాగభూషణ్, రిజిస్ట్రార్ డాక్టర్ ఎంఎస్ రఘునాథన్, ఆయా విభాగాల డీన్లు, అధిపతులు ప్రత్యేకంగా అభినందించారు.