విజ్ఞాన్స్‌ యూనివర్సిటీ – న్యూకాన్‌ ఏరోస్పేస్‌ల మధ్య అవగాహన ఒప్పందం

విజ్ఞాన్స్‌ యూనివర్సిటీ – న్యూకాన్‌ ఏరోస్పేస్‌ల మధ్య అవగాహన ఒప్పందం
టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్:
చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్స్‌ యూనివర్సిటీ – హైదరాబాద్‌లోని న్యూకాన్‌ ఏరోస్పేస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ల(ఎన్‌ఏపీఎల్‌) మధ్య అవగాహన ఒప్పందం కుదిరిందని శనివారం యూనివర్సిటీ వైస్‌ చాన్స్‌లర్‌ ప్రొఫెసర్‌ పీ.నాగభూషణ్‌ తెలిపారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎన్‌ఏపీఎల్‌ ఆర్‌ అండ్‌ డీ జనరల్‌ మేనేజర్‌ జేఎల్‌పీ తిలక్‌తో వర్సిటీ వైస్‌ చాన్స్‌లర్‌ ప్రొఫెసర్‌ పీ.నాగభూషణ్‌ అవగాహన ఒప్పందానికి సంబంధించిన పత్రాలను మార్చుకున్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వర్సిటీ వైస్‌ చాన్స్‌లర్‌ మాట్లాడుతూ ఈ అవగాహన ఒప్పందం వలన ఏరోస్పేస్‌ ఇంజనీరింగ్, డిఫెన్స్‌ టెక్నాలజీలకు సంబంధించిన రంగాలలో ఉమ్మడిగా పరిశోధనలు చేయడంతో పాటు డెవలప్‌మెంట్‌ ప్రాజెక్ట్‌లను సులభతరం చేయవచ్చునన్నారు. ప్రస్తుతం పరిశ్రమలు ఎదుర్కొంటున్న సవాళ్లను పరిష్కరించడం, వాటికి వినూత్న పరిష్కారాలను అభివృద్ధి చేయడంలో ఉమ్మడిగా కృషి చేస్తామన్నారు. విద్యార్థులు, అధ్యాపకులు, పరిశోధకుల్లో నైపుణ్యాభివృద్ధిని పెంపొందించడానికి ఉమ్మడి శిక్షణా కార్యక్రమాలు, వర్క్‌షాప్‌లు, సెమినార్‌లు మరియు ఇండస్ట్రీ–అకాడెమియా ఇంటరాక్షన్స్‌ను నిర్వహిస్తామన్నారు. వీటితో పాటు విద్యార్థులకు ఇంటర్న్‌షిప్‌ అవకాశాలను అందించడం, ప్రాక్టికల్‌ ఇండస్ట్రీ అనుభవాన్ని అందించడంతో పాటు వృత్తిపరమైన వృద్ధిని పెంపొందిస్తామన్నారు. ఎన్‌ఏపీఎల్‌ ఉద్యోగుల కోసం ఎంటెక్‌ కోర్సును ప్రత్యేకంగా రూపొందించి వారిలో సాంకేతిక నైపుణ్యాలను మెరుగుపరచడంతో పాటు విద్యా అర్హతలను పెంచుతామన్నారు. అంతేకాకుండా నిర్దిష్ట పరిశ్రమ అవసరాలను తీర్చడంతో పాటు విద్యా అనుభవాన్ని పెంచుకోవడానికి ఏరోస్పేస్‌ టెక్నాలజీస్‌లో న్యూకాన్‌ టైలర్డ్‌ మైనర్‌/హానర్‌/మాడ్యులర్‌ ప్రోగ్రామ్‌లను పరిచయం చేస్తామన్నారు. వీటితో పాటు న్యూకాన్‌ ఉద్యోగులకు పీహెచ్‌డీలో ప్రవేశంకు కూడా అవకాశం కల్పిస్తామన్నారు. ఈ సందర్భంగా ఎన్‌ఏపీఎల్‌ ఆర్‌ అండ్‌ డీ జనరల్‌ మేనేజర్‌ జేఎల్‌పీ తిలక్‌ మాట్లాడుతూ విజ్ఞాన్స్‌ యూనివర్సిటీతో అవగాహన ఒప్పందం కుదుర్చుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు. విద్యార్థులను సరికొత్త టెక్నాలజీల వైపు ప్రోత్సహించడంతో పాటు వారికి ఆయా రంగాలలో తర్ఫీదనివ్వడమే ఈ ఒప్పందం లక్ష్యమన్నారు. కార్యక్రమంలో ఎన్‌ఏపీఎల్‌ హెచ్‌ఆర్‌ విభాగాధిపతి అరవింద్‌ కుమార్, వైస్‌ చాన్స్‌లర్‌ ప్రొఫెసర్‌ పీ.నాగభూషణ్, రిజిస్ట్రార్‌ డాక్టర్‌ ఎంఎస్‌ రఘునాథన్, వర్సిటీలోని ఆయా విభాగాల డీన్లు, అధిపతులు, సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.