సరికొత్త ఆవిష్కరణలకు మార్గం సుగమం

సరికొత్త ఆవిష్కరణలకు మార్గం సుగమం 

 - ఇటలీలోని పొలిటెక్నికో డి టోరినో డాక్టర్‌ శాంటో బెనర్జీ
- విజ్ఞాన్స్‌లో ఘనంగా ప్రారంభమైన ఐసీఎన్‌ఏఎస్‌సీ–24 అంతర్జాతీయ కాన్ఫరెన్స్‌
టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్:
నాన్‌ లీనియర్‌ అనాలిసిస్‌తో ఆవిష్కరణలను, పరిశోధనలను వేగంగా తీసుకెళ్లటంతో పాటు ఖచ్చితత్వం కలిగించి, సరికొత్త ఆవిష్కరణలకు మార్గం సుగమం చేస్తుందని ఇటలీలోని పొలిటెక్నికో డి టోరినో డాక్టర్‌ శాంటో బెనర్జీ అన్నారు. చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్స్‌ యూనివర్సిటీలోని స్కూల్‌ ఆఫ్‌ అప్లైడ్‌ సైన్స్‌ అండ్‌ హ్యుమానిటీస్‌ విభాగంలోని డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ మేథమ్యాటిక్స్‌ అండ్‌ స్టాటిస్టిక్స్‌ విభాగం, సెర్బ్‌ల సంయుక్త ఆధ్వర్యంలో  ‘‘ఇంటర్నేషనల్‌ కాన్ఫరెన్స్‌ ఆన్‌ నాన్‌–లీనియర్‌ అనాలిసిస్‌ అండ్‌ సైంటిఫిక్‌ కంప్యూటింగ్‌ (ఐసీఎన్‌ఏఎస్‌సీ–2024)’’ అనే అంశంపై మూడు రోజుల పాటు నిర్వహించనున్న అంతర్జాతీయ కాన్ఫరెన్స్‌ను హైబ్రిడ్‌ మోడ్‌లో (ఆన్‌లైన్‌ అండ్‌ ఆఫ్‌లైన్‌) గురువారం ఘనంగా ప్రారంభించారు. అనంతరం ‘‘ఐసీఎన్‌ఏఎస్‌సీ–2024’’కు సంబంధించిన ప్రత్యేక సంచికను విడుదల చేశారు.  కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఇటలీలోని పొలిటెక్నికో డి టోరినో డాక్టర్‌ శాంటో బెనర్జీ మాట్లాడుతూ నాన్‌ లీనియర్‌ విశ్లేషణ సాంకేతికత, ఇంజనీరింగ్‌ సమస్యల పరిష్కారం కోసం ఉపయోగపడుతుందన్నారు. లీనియర్‌ పద్ధతులతో సాధ్యం కాని సమస్యలను ఇది అర్థం చేసుకుని వాటిని పరిష్కరించడానికి సహకరిస్తుందన్నారు. ఉదాహరణకు, వాతావరణ మార్పులపై లేదా భూకంపాలను అంచనా వేసే విషయాలలో నాన్‌ లీనియర్‌ అనలిసిస్‌ కీలక పాత్ర పోషిస్తుందన్నారు. నాన్‌ లీనియర్‌ సిస్టమ్స్‌ వాస్తవ ప్రపంచ సమస్యలకు దగ్గరగా ఉంటాయన్నారు. మన వాతావరణం, జీవవైజ్ఞానిక సిస్టమ్స్, ఆర్థిక వ్యవస్థలు వంటి అంశాలన్నీ నాన్‌ లీనియర్‌ విధానాల్లో పనిచేయడం వలన సమస్యల పరిష్కారం సులభతరం అవుతుందన్నారు. వీటితో పాటు విద్యార్థులు ఆర్టిఫిసియల్‌ ఇంటెలిజెన్స్, క్రిప్టోగ్రఫీ, ఐవోటీ, డేటా సైన్స్‌ వంటి సబ్జెక్ట్‌ల మీద కూడా అవగాహన పెంచుకోవాలన్నారు. కార్యక్రమానికి మరో ముఖ్య అతిథిగా హాజరైన ఎన్‌ఐటీ దుర్గాపూర్‌ ప్రొఫెసర్‌ సమర్జిత్‌ కర్‌ మాట్లాడుతూ సైంటిఫిక్‌ కంప్యూటింగ్‌ను ఉపయోగించడం వలన పెద్ద గణనలతో పాటు సంక్లిష్ట సిమ్యులేషన్లతో కఠినమైన ఇంజనీరింగ్‌ మరియు శాస్త్రీయ పరిశోధనలు వేగవంతం చేయవచ్చునన్నారు. ఇది ఆస్ట్రోఫిజిక్స్‌ నుండి మెటీరియల్‌ సైన్స్‌ వరకు విస్తృతంగా ఉపయోగపడుతుందన్నారు. ఐఐటీ ధన్‌బాద్‌ ప్రొఫెసర్‌ శ్రీనివాసరావ్‌ పెంట్యాల మాట్లాడుతూ సైంటిఫిక్‌ కంప్యూటింగ్‌ సాఫ్ట్‌వేర్‌ ఉపయోగించి చాలా ఎక్కువ గణనలను, డేటా విశ్లేషణను తక్కువ సమయంలోనే చేయవచ్చునన్నారు. ఇది పరిశోధనలకు, పరిశ్రమలకు ఖర్చును తగ్గించడంతో పాటు పరిశోధనల వేగాన్ని పెంచుతుందన్నారు. పాండిచ్చేరి యూనివర్సిటీ ప్రొఫెసర్‌ తిరుపతి రావ్‌ పాడి మాట్లాడుతూ విద్యార్థుందరూ స్టెమ్‌ ( సైన్స్, టెక్నాలజీ, ఇంజినీరింగ్, మ్యాథమేటిక్స్‌) కాన్సెప్ట్‌ను అర్థం చేసుకోవాలన్నారు. ప్రస్తుతం ప్రపంచం మొత్తం మేథమేటిక్స్‌ మీదనే దృష్టిని కేంద్రీకరిస్తుందన్నారు. డేటా సైన్స్, ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్, మెషీన్‌ లెర్నింగ్‌ వంటి ఆధునిక సాంకేతికతలు కూడా సైంటిఫిక్‌ కంప్యూటింగ్‌పై ఆధారపడి ఉంటాయన్నారు. ఇవి ఆధునిక సమస్యలకు, భారీ డేటా విశ్లేషణలకు తోడ్పడుతాయన్నారు. టాంజానియాలోని యూనివర్సిటీ ఆఫ్‌ డొడోమా అధ్యాపకులు డాక్టర్‌ జీ.శ్రీనివాస రావు మాట్లాడుతూ నాన్‌ లీనియర్‌ అనలిసిస్‌ మరియు సైంటిఫిక్‌ కంప్యూటింగ్‌లు కొత్త కొత్త ఆవిష్కరణలకు దారితీస్తాయన్నారు. ఇది పరిశోధనలను మరింత అధునాతనంగా చేయడమే కాకుండా భవిష్యత్‌ సమస్యలను పరిష్కరించేందుకు కొత్త మార్గాలను చూపిస్తాయన్నారు. అలహాబాద్‌లోని ఎమ్‌ఎన్‌ఎన్‌ఐటీ ప్రొఫెసర్‌ శివ్‌ దత్‌ కుమార్‌ మాట్లాడుతూ మేథమేటిక్స్‌లో ఇప్పటికీ పరిష్కరించని ప్రాబ్లమ్స్‌ అనేకం ఉన్నాయన్నారు. వాటిలో విద్యార్థులు ఏదైనా ఒక ప్రాబ్లమ్‌ను పరిష్కరించగలిగితే వారి జీవితం స్థిరపడుతుందన్నారు. ఐఎస్‌ఐ కోల్‌కత్త ప్రొఫెసర్‌ అరుప్‌ కుమార్‌ దాస్‌ మాట్లాడుతూ భౌతిక, జీవ, రసాయన శాస్త్రాలలో విస్తృత అనువర్తనాలు చేయాలన్నారు. నాన్‌ లీనియర్‌ అనలిసిస్‌ మరియు సైంటిఫిక్‌ కంప్యూటింగ్‌ను ఫ్లూయిడ్‌ డైనమిక్స్, క్వాంటం ఫిజిక్స్, బయోలాజికల్‌ సిస్టమ్స్‌ వంటి అనేక రంగాల్లో వాడుకోవచ్చని తెలియజేసారు. సిక్కిం మణిపాల్‌ యూనివర్సిటీ అధ్యాపకులు డాక్టర్‌ అసిత్‌ సాహ మాట్లాడుతూ మేథమ్యాటిక్స్, స్టాటిస్టిక్స్‌లో ప్రావీణ్యం పొందిన విద్యార్థులు భవిష్యత్‌లో డేటాసైన్స్‌ను పరిశోధనాంశంగా ఎంచుకోవాలన్నారు. ప్రస్తుతం అన్ని మల్టీ నేషనల్‌ కంపెనీలు డేటాసైన్స్‌ను విరివిగా వినయోగిస్తున్నారని తెలియజేసారు. కాబట్టి ఇందులో ప్రావీణ్యం పొందిన విద్యార్థులకు మంచి డిమాండ్‌ ఉంటుందన్నారు. ఈ అంతర్జాతీయ కాన్ఫరెన్స్‌లో వివిధ దేశాలు, రాష్ట్రాల నుంచి 500 మందికి పైగా అధ్యాపకులు, రీసెర్చ్‌ స్కాలర్స్‌ పాల్గొని వారి పరిశోధనా పత్రాలను ప్రచురించారు. కార్యక్రమంలో విజ్ఞాన్స్‌ విద్యాసంస్థల వైస్‌ చైర్మన్‌ లావు శ్రీకృష్ణదేవరాయలు, వర్సిటీ వైస్‌ చాన్స్‌లర్‌ ప్రొఫెసర్‌ పీ.నాగభూషణ్, రిజిస్ట్రార్‌ డాక్టర్‌ ఎంఎస్‌ రఘునాథన్, ఆయా విభాగాల డీన్లు, అధిపతులు, అధ్యాపక సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.