విజ్ఞాన్స్ యూనివర్సిటీలో ఇంకుబేషన్ సెంటర్ ప్రారంభం
చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్స్ యూనివర్సిటీలోని స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్, ఫుడ్ టెక్నాలజీ విభాగంలోని అగ్రికల్చరల్ అండ్ హార్టికల్చరల్ సైన్సెస్ డిపార్ట్మెంట్, యూఎస్ఏఐడీ, సిఫార్, వరల్డ్ ఆగ్రోఫారెస్ట్రీల సంయుక్త ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ‘‘ట్రీ బేస్డ్ ఎంటర్ప్రైజ్ ఇంకుబేషన్ సెంటర్ను (టీబీఈఐసీ)’’ సోమవారం ఘనంగా ప్రారంభించారు. ఇంకుబేషన్ సెంటర్ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా ఇండియాలోని యూఎస్ఏఐడీ జనరల్ డెవలప్మెంట్ ఆఫీస్ డైరెక్టర్ టెగెన్ఫెల్డెట్ మార్క్ హాజరై సెంటర్ను రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా విజ్ఞాన్ యూనివర్సిటీ వైస్ చాన్స్లర్ కల్నల్, ప్రొఫెసర్ పీ.నాగభూషణ్ మాట్లాడుతూ రెండు తెలుగు రాష్ట్రాలలో ట్రీ బేస్డ్ ఎంటర్ప్రైజ్ ఇంకుబేషన్ సెంటర్ను ప్రారంభించిన ఘనత విజ్ఞాన్స్ యూనివర్సిటీకే దక్కుతుందన్నారు. అంతేకాకుండా విజ్ఞాన్లో ఏర్పాటు చేసిన సెంటర్ దేశంలోనే రెండవ అత్యధికమైన ఇంకుబేషన్ సెంటరని తెలియజేసారు. దేశ ఆర్థిక వృద్ధిని పెంచడంతో పాటు జనాభా ప్రయోజనాలను ప్రభావితం చేయడానికి, గ్రామీణ యువతతో పాటు వ్యాపారవేత్తలలో స్కిల్స్ను అభివృద్ధి చేసి లక్ష్యాలను సులభతరంగా అందుకునేలా చేయడమే ఈ సెంటర్ ముఖ్య ఉద్దేశ్యమన్నారు. ఈ సెంటర్ సహాయంతో రైతుల నుంచి సేకరించిన చెక్కకు వీలైనంత విలువను జోడింపచేయటం, నాన్–వుడ్ ట్రీస్ అవుట్ సైడ్ ఫారెస్ట్ ఉత్పత్తులకు కూడా విలువ జోడించటం, ఆసక్తి కలిగిన ఔత్సాహిక ఇంక్యుబేటీస్కు తగిన సౌకర్యాలు కల్పిస్తామన్నారు. ఈ కార్యక్రమం దేశంలోని ఏడు రాష్ట్రాలలో (ఆంధ్రప్రదేశ్, అస్సాం, హర్యానా, ఒడిశా, రాజస్థాన్, తమిళనాడు మరియు ఉత్తరప్రదేశ్) జీవనోపాధి, పర్యావరణ వ్యవస్థ ప్రయోజనాల కోసం అడవులను విస్తరించాలని లక్ష్యంగా పెట్టుకుందన్నారు. ఎంటర్ప్రెన్యూర్స్గా ఎదగాలనే ఆసక్తి ఉన్న విద్యార్థులు ఇంక్యుబేషన్ సెంటర్ సహాయంతో స్థానిక వాతావరణాన్ని మెరుగుపరుస్తూ స్థిరమైన వ్యాపారాలను నడపడానికి, స్కిల్స్, నాలెడ్జ్ను డెవలప్ చేసుకోవచ్చన్నారు. ట్రీ–బేస్డ్ ఎంటర్ప్రైజ్ ఇంక్యుబేషన్ సెంటర్ అనేది ఆంధ్రప్రదేశ్లో స్థిరమైన ఆగ్రోఫారెస్ట్రీ పద్ధతులను ప్రోత్సహించాలనే ఉద్దేశ్యంతో ఈ సెంటర్ను ప్రారంభించామన్నారు. ఈ సెంటర్లను ప్రోత్సహించడం ద్వారా కేంద్రం స్థానిక కమ్యూనిటీల జీవనోపాధికి మద్దతు ఇవ్వడమే కాకుండా సంప్రదాయ అటవీ ప్రాంతాల వెలుపల చెట్లను విస్తరించడంలో కూడా సహాయ పడుతుందన్నారు. పర్యావరణ వ్యవస్థ సేవలను మెరుగుపరచడంలోను, రాష్ట్రంలో వాతావరణ స్థితిస్థాపకతను నిర్మించడంలో ఇటువంటి ప్రయత్నాలు చాలా కీలకమన్నారు. కార్యక్రమానికి మరో ముఖ్య అతిథిగా హాజరైన విజ్ఞాన్స్ విద్యాసంస్థల చైర్మన్ డాక్టర్ లావు రత్తయ్య మాట్లాడుతూ అవుట్సైడ్ ఫారెస్ట్ ప్రాంతాల్లో కూడా మొక్కలను విరివిగా పెంచినట్లైతే ప్రజల జీవనోపాధి, పర్యావరణ వ్యవస్థ సేవలను మెరుగుపరుస్తుందన్నారు. అడవులను విపరీతంగా నరకివేయడం వలన ఉష్టోగ్రతలు పెరిగి గ్లోబల్ వార్మింగ్ పెరిగే అవకాశం ఉందన్నారు. తత్ఫలితంగా వచ్చే పరిణామాలను మనం తట్టుకోలేమన్నారు. అందువలన ప్రతి విద్యార్థి కూడా ఖాళీ ప్రదేశాలలో గ్రీనరీ మొక్కలను నాటాలని పిలుపునిచ్చారు. అవుట్సైడ్ ఫారెస్ట్ ప్రాంతాల్లో కూడా మొక్కలను విరివిగా పెంచి పర్యావరణ సమతుల్యానికి కృషి చేయాలని విద్యార్థులకు సూచించారు. కార్యక్రమంలో ఇండియాలోని యూఎస్ఏఐడీ జనరల్ డెవలప్మెంట్ ఆఫీస్ డైరెక్టర్ టెగెన్ఫెల్డెట్ మార్క్, ఇండియాలోని యూఎస్ఏఐడీ ఎన్విరాన్మెంట్ టీమ్ లీడ్ సౌమిత్రి దాస్, ఐసీఆర్ఏఎఫ్–సిఫార్ సీనియర్ అడ్వైజర్ డాక్టర్ రవి ప్రభు, ఐసీఆర్ఏఎఫ్–సిఫార్– టీవోఎఫ్ఐ ప్రోగ్రామ్ చీఫ్ ఆఫ్ పార్టీ మనోజ్ దబాస్, విజ్ఞాన్స్ విద్యాసంస్థల చైర్మన్ డాక్టర్ లావు రత్తయ్య, వైస్ చాన్స్లర్ కల్నల్, ప్రొఫెసర్ పీ.నాగభూషణ్, రిజిస్ట్రార్ డాక్టర్ ఎంఎస్ రఘునాథన్, ఆయా విభాగాల డీన్లు, అధిపతులు, అధ్యాపక సిబ్బంది, అగ్రికల్చరల్ విద్యార్థులు పాల్గొన్నారు.