రైతుల సంక్షేమం, వ్యవసాయ అభివృద్ధే లక్ష్యం
- రైతు సాధికార సంస్థ ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్మన్, ఏపీ ప్రభుత్వ డిపార్ట్మెంట్ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ కోఆపరేషన్ అడ్వైజర్, మాజీ ఐఏఎస్ టీ.విజయ్ కుమార్
- విజ్ఞాన్స్ యూనివర్సిటీలో ఘనంగా ప్రారంభమైన అంతర్జాతీయ సదస్సు
రైతు సాధికార సంస్థ ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని రైతుల సంక్షేమం, వ్యవసాయ అభివృద్ధి, మరియు జీవనోపాధి మెరుగుదలకు కృషి చేయడమే లక్ష్యమని రైతు సాధికార సంస్థ ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్మన్, ఏపీ ప్రభుత్వ డిపార్ట్మెంట్ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ కోఆపరేషన్ అడ్వైజర్, మాజీ ఐఏఎస్ టీ.విజయ్ కుమార్ అన్నారు. చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్స్ యూనివర్సిటీలోని స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ ఫుడ్ టెక్నాలజీ విభాగంలోని డిపార్ట్మెంట్ ఆఫ్ అగ్రికల్చరల్ అండ్ హార్టికల్చరల్ సైన్సెస్, అపారి ( ఆసియా–పసిఫిక్ అసోసియేషన్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ ఇనిస్టిట్యూట్స్) మరియు యూరోపియన్ ప్లాంట్ హెల్త్ రీసెర్చ్ అండ్ కోఆర్డినేషన్ల సంయుక్త ఆధ్వర్యంలో ‘‘ ప్లాంట్ హెల్త్ ఇన్ ఆసియా : రీసెర్చ్ ప్రయారిటీస్ అండ్ పార్ట్నర్షిప్స్’’ అనే అంశంపై రెండు రోజుల పాటు నిర్వహించనున్న ఇంటర్నేషనల్ సదస్సును మంగళవారం ఘనంగా ప్రారంభించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన రైతు సాధికార సంస్థ ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్మన్, ఏపీ ప్రభుత్వ డిపార్ట్మెంట్ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ కోఆపరేషన్ అడ్వైజర్, మాజీ ఐఏఎస్ టీ.విజయ్ కుమార్ మాట్లాడుతూ రైతులకు ఆర్థిక, సాంకేతిక సహాయం, ఉచిత సలహాలు, మార్గదర్శకాలు అందిస్తామన్నారు. వీటితో పాటు సేంద్రియ వ్యవసాయాన్ని కూడా ప్రోత్సహిస్తామన్నారు. రసాయన యుక్త వ్యవసాయానికి ప్రత్యామ్నాయంగా సేంద్రియ విధానాలను ప్రోత్సహించడం, సేంద్రియ ఎరువులు, విత్తనాలు, పద్ధతులపై అవగాహన కూడా కల్పిస్తామన్నారు. రైతులకు వ్యవసాయ పెట్టుబడుల కోసం సబ్సిడీలు అందించడం, పంటల బీమా పథకాలను అమలు చేయడం, పంటల డైవర్సిఫికేషన్, రైతులను వివిధరకాల పంటలు సాగు చేసుకునేలా ప్రోత్సహించడం, మార్కెటింగ్ సదుపాయాలు కల్పిస్తామన్నారు. మట్టిని, నీటిని, ప్రకృతి వనరులను సంరక్షించే విధానాలను అమలు చేయడం, హానికరమైన పద్ధతులను తగ్గించి, పర్యావరణ హితమైన పద్ధతులకు ప్రోత్సాహిస్తామన్నారు. అంతేకాకుండా రైతులకు కొత్త వ్యవసాయ పద్ధతులపై శిక్షణలు అందించడం, మౌలిక వసతులు, ఆధునిక పద్ధతులపై అవగాహన కల్పించడం, రైతు స్వాభిమానాన్ని పెంపొందించడం తమ లక్ష్యమన్నారు. రైతుల జీవనోపాధిని మెరుగుపరచడం ద్వారా గ్రామీణాభివృద్ధి సాధించడం తమ లక్ష్యాలలో భాగమన్నారు. రైతు బంధు, రైతు భరోసా వంటి పథకాలను సమర్థవంతంగా అమలు చేస్తామన్నారు. రైతు సాధికార సంస్థ ఆంధ్రప్రదేశ్లో వ్యవసాయ రంగాన్ని పునరుజ్జీవింపజేయడంతో పాటు రైతుల జీవన ప్రమాణాలను మెరుగుపరచడంలో కీలక పాత్ర పోషిస్తుందన్నారు. కార్యక్రమానికి మరో ముఖ్య అతిథిగా హాజరైన బ్యాంకాక్లోని అపారి ఎగ్జిక్యూటివ్ డైరక్టర్ డాక్టర్ రవి ఖేతర్పాల్ మాట్లాడుతూ ఆహార ఉత్పత్తి నుంచి వినియోగం వరకు వ్యవసాయ–ఆహార వ్యవస్థలో ఆధునిక పద్ధతులను అనుసరించడం అవసరమన్నారు. వృక్షాల ఆరోగ్యాన్ని పరిరక్షించడంలో ఫీల్డ్ సెన్సార్లు, డ్రోన్లు, డిజిటల్ పద్ధతుల ఉపయోగం ఎక్కువగా కనిపిస్తుందన్నారు. ఈ టెక్నాలజీలు వ్యవసాయ ప్రదేశాలలో తక్షణమే వ్యాధులను గుర్తించి, వాటిని నివారించేందుకు సహకరిస్తాయని వెల్లడించారు. స్మార్ట్ ఫోన్లు, డేటా అనలిటిక్స్ ఆధారంగా పురుగుల దాడిని ముందుగానే అంచనా వేసి, సమయానుకూలంగా చర్యలు తీసుకోవడం సాధ్యమవుతుందన్నారు. రసాయన వినియోగాన్ని తగ్గించేందుకు, ప్రకృతి ఆధారిత పరిష్కారాలను ప్రోత్సహించే ప్రణాళికలు తీసుకోవడం ద్వారా వృక్ష ఆరోగ్యానికి మాత్రమే కాకుండా మట్టి ఆరోగ్యానికీ అనుకూలంగా ఉంటాయన్నారు. డిజిటల్ వ్యవసాయం, ఏఐ, ఐవోటీ వంటి టెక్నాలజీల సహాయంతో వ్యవసాయ దిగుబడులను మెరుగుపరచడమే కాకుండా, వృక్షాలకు అనుకూలమైన ఆహారపదార్థాల ఉత్పత్తికి కూడా తోడ్పడతాయన్నారు. సేంద్రియ, ఇన్నోవేటివ్ పద్ధతులు వృక్ష ఆరోగ్యంతో పాటు ప్రకృతి ఆరోగ్యాన్ని కూడా పెంపొందిస్తాయన్నారు. కార్యక్రమానికి మరో ముఖ్య అతిథిగా హాజరైన యూరోపియన్ ఫైటోశానిటరీ రీసెర్చ్ కోఆర్డినేషన్ కోఆర్టినేటర్ డాక్టర్ బల్దిస్సెర జీవాని మాట్లాడుతూ యూరోపియన్ ఫైటోశానిటరీ రీసెర్చ్ ద్వారా పరిశోధన ప్రాజెక్టులను సమన్వయం చేయడంతో పాటు వృక్ష ఆరోగ్యం సంబంధిత పరిశోధన ప్రాజెక్టులలో వివిధ దేశాల పరిశోధకులను కలిసి పని చేయడానికి సహాయపడుతుందన్నారు. వృక్ష ఆరోగ్య విధానాలకు మద్దతు ఇవ్వడం, వృక్ష ఆరోగ్యంపై యూరోపియన్ విధానాలను మెరుగుపరచడంలో ఈ సంస్థ పరిశోధన చేస్తూ, శాస్త్రీయ ఆధారాలను అందిస్తుందన్నారు. మా సంస్థ వ్యవసాయం, అడవులపై ముప్పు కలిగించే వృక్ష పశు వ్యాధులు, పెచ్చులను గుర్తించడం, పర్యవేక్షించడం, నిర్వహించడం కోసం పని చేస్తుందన్నారు. యూరోపియన్ మరియు అంతర్జాతీయ పరిశోధకులు మరియు సంస్థల మధ్య సహకారాన్ని పెంచడంలో సహాయపడుతుందన్నారు. తద్వారా ప్రపంచవ్యాప్తంగా వృక్ష ఆరోగ్య సమస్యలను పరిష్కరించడానికి సహాయం చేస్తామన్నారు. వ్యవసాయ ఉత్పత్తి మరియు పర్యావరణ సుస్థిరతను మెరుగుపరచడానికి వృక్ష వ్యాధులు, పెచ్చులను సమర్థవంతంగా నిరోధించడం, నిర్వహించడం ద్వారా కీలక పాత్ర పోషిస్తుందన్నారు. అనంతరం అంతర్జాతీయ సదస్సులో భాగంగా అగ్రి ఎంటర్ప్రెన్యూర్షిప్స్ అండ్ పబ్లిక్ ప్రై వేట్ ఫార్మర్ పార్టనర్షిప్ ఫర్ ప్లాంట్ హెల్త్, ఆర్టిఫిసియల్ ఇంటెలిజెన్స్ అండ్ ఐవోటీ ఫర్ ప్లాంట్ హెల్త్ మేనేజ్మెంట్, ప్లాంట్ హెల్త్ అడ్వోకసీ ఇన్ ఆసియా, చేంజింగ్ పెస్ట్ సినారియో, ఎపిడిమాలజీ, ఫోర్కాస్టింగ్ అండ్ మోనిటరింగ్ ఇన్ రిలేషన్ టు కై్లమేట్ చేంజ్ అనే అంశాలపై చర్చించారు. కార్యక్రమంలో యూరోపియన్ ఫైటోశానిటరీ రీసెర్చ్ కోఆర్డినేషన్ కోఆర్టినేటర్ డాక్టర్ బల్దిస్సెర జీవాని, హైదరాబాద్లోని ఐకార్–ఐఐవోఆర్ ప్రాజెక్ట్ మేనేజర్ డాక్టర్ కే.ఎస్.వరప్రసాద్, అసారి టెక్నికల్ కోఆర్డినేటర్ డాక్టర్ పాల్ డబ్యూజే టేలర్, సౌత్ ఆసియా కాబి ఇంటర్నేషనల్ రీజనల్ డైరక్టర్ డాక్టర్ వినోద్ పండిట్, విజ్ఞాన్స్ విద్యాసంస్థల చైర్మన్ డాక్టర్ లావు రత్తయ్య, వర్సిటీ వైస్ చాన్స్లర్ కల్నల్, ప్రొఫెసర్ పీ.నాగభూషణ్, ఇంచార్జి రిజిస్ట్రార్ డాక్టర్ పీఎంవీ రావు, ఆయా విభాగాల డీన్లు, అధిపతులు, పరిశోధన విద్యార్థులు పాల్గొన్నారు.