విజ్ఞాన్స్ యూనివర్సిటీలో ఘనంగా నూతన సంవత్సర వేడుకలు
టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్:
చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్స్ యూనివర్సిటీ, విజ్ఞాన్స్ లారా, విజ్ఞాన్స్ ఫార్మసీ, విజ్ఞాన్స్ జూనియర్ కాలేజీలలోని విద్యార్థుల ఆధ్వర్యంలో బుధవారం నూతన సంవత్సర వేడుకలను ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు కోటి ఆశలతో నూతన సంవత్సరానికి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన విజ్ఞాన్స్ విద్యా సంస్థల చైర్మన్ డాక్టర్ లావు రత్తయ్య మాట్లాడుతూ విద్యార్థులు జీవితంలో ఉన్నత స్థానాలను అధిరోహించడానికి సరికొత్త మార్గాలను అన్వేషించాలన్నారు. నూతన టెక్నాలజీలపై అవగాహన పెంచుకున్న విద్యార్థులకు మాత్రమే భవిష్యత్తులో ఉన్నత ఉద్యోగాలు దక్కుతాయని తెలిపారు. 2025 సంవత్సరంలో విద్యార్థులు కష్టమైన లక్ష్యాన్ని ఎంచుకుని... వాటిని సాధించేందుకు పట్టుదలతో కృషిచేయాలని సూచించారు. అనంతరం విద్యార్థులతో 2025వ సంవత్సరానికి గాను తీర్మానించిన ప్రతిజ్ఞను చేయించారు. ఈ సందర్భంగా విజ్ఞాన్స్ యూనివర్సిటీæవైస్ చాన్స్లర్ ప్రొఫెసర్ పీ.నాగభూషణ్ మాట్లాడుతూ విద్యార్థులకు నైపుణ్యంతో పాటు పరిశోధనాత్మక ఆలోచనలు కలిగిన విద్యా విధానం ఉండాలని తెలిపారు. కార్పొరేట్ ప్రపంచంలో యువతకు విస్తృత అవకాశాలున్నాయని, వాటిని సాధించేందుకు అవసరమైన సామర్థ్యాన్ని పెంపొందించుకోవాలని సూచించారు. అనంతరం విద్యార్థులందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసి కేక్ను కట్ చేశారు. నూతన సంవత్సర వేడుక కార్యక్రమంలో వర్సిటీ ఇంచార్జి రిజిస్ట్రార్ డాక్టర్ పీఎంవీ రావు, మాజీ డీజీపీ, విజ్ఞాన్స్ యూనివర్సిటీ అడ్వైజర్ మాలకొండయ్య, లారా కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ కే.ఫణీంద్రకుమార్, ఫార్మసీ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ పీ.శ్రీనివాసబాబు, జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ జే.మోహన్ రావు, ఆయా విభాగాల డీన్లు, అధిపతులు, అధ్యాపక సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.