ఫార్మసీ సిలబస్ను డిజిటలైజ్ చేయబోతున్నాం
- ఫార్మసీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ప్రెసిడెంట్ డాక్టర్ మోంటుకుమార్ ఎం.పటేల్
- విజ్ఞాన్ ఫార్మసీలో ఘనంగా ప్రారంభమైన అంతర్జాతీయ కాన్ఫరెన్స్
ప్రస్తుతం రోజు రోజుకు పెరుగుతున్న ఇండస్ట్రీ అవసరాలు, టెక్నాలజీలకు అనుగుణంగా ఫార్మసీ సిలబస్ను డిజిటలైజ్ చేయబోతున్నామని ఫార్మసీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (పీసీఐ) ప్రెసిడెంట్ డాక్టర్ మోంటుకుమార్ ఎం.పటేల్ అన్నారు. చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్ ఫార్మసీ కళాశాలలో ‘‘ఎమర్జింగ్ ట్రెండ్స్ ఇన్ పర్సనలైజ్డ్ డ్రగ్ డిస్కవరీస్– ఏ ఫ్యూచరిస్టిక్ అప్రోచ్’’ అనే అంశంపై మూడు రోజుల పాటు నిర్వహించనున్న ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ను ‘‘ నెక్ట్స్జెన్ ఫార్మా కనెక్ట్–2025’’ అనే ఇతివృత్తంతో గురువారం ఘనంగా ప్రారంభించారు. ముందుగా జ్యోతి ప్రజ్వలన నిర్వహించిన తర్వాత ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్కు సంబంధించిన సావనీర్ను విడుదల చేసారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఫార్మసీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ప్రెసిడెంట్ డాక్టర్ మోంటుకుమార్ ఎం.పటేల్ మాట్లాడుతూ పీసీఐ ద్వారా విద్యార్థులకు, అధ్యాపకులకు సరికొత్త టెక్నాలజీలపైన ట్రైనింగ్ ఇవ్వడంతో పాటు స్కిల్స్ పెంపొందించడానికి కృషి చేస్తున్నామన్నారు. ప్రతి నెలా 150 మంది విద్యార్థులకు ట్రైనింగ్ అందించడానికి వీలుగా ట్రైనింగ్ సెంటర్ను కూడా ఏర్పాటు చేస్తున్నామన్నారు. పర్సనలైజ్డ్ డ్రగ్ డిస్కవరీస్ అనేది వైద్యరంగంలో ఒక కొత్త దిశను ప్రవేశపెడుతోందని, ఇది రోగులకు సరైన చికిత్స అందించడంతో పాటు, అనవసరమైన దుష్ప్రభావాలను తగ్గించే అవకాశం కల్పిస్తుందన్నారు. భవిష్యత్తులో మరిన్ని పరిశోధనలు జరిగితే, ఆరోగ్య రంగం మరింత అభివృద్ధి చెందే అవకాశం ఉందన్నారు. జన్యు ప్రొఫైలింగ్ మరియు ఖచ్చితమైన చికిత్సల వైపు ప్రయాణిస్తున్నప్పుడు, రోగుల డేటాను రక్షించడం, సమానత్వాన్ని నిర్ధారించడం, మరియు నైతిక ప్రమాణాలను పాటించడం మన ప్రాధాన్యతగా ఉండాలన్నారు. కార్యక్రమానికి గౌరవ అతిథిగా హాజరైన న్యూఢిల్లీలోని పీసీఐ సెంట్రల్ కౌన్సిల్ మెంబర్ డాక్టర్ ఎం.వెంకట రమణ మాట్లాడుతూ పర్సనలైజ్డ్ డ్రగ్ డిస్కవరీస్ వలన జన్యుపరమైన విశ్లేషణ ద్వారా ఏ ఔషధం రోగికి అనుకూలమవుతుందో ముందుగానే అంచనా వేసి సరైన మందును అందించవచ్చునన్నారు. పర్సనలైజ్డ్ డ్రగ్ డిస్కవరీస్ అనేది వైద్య రంగంలో విప్లవాత్మక మార్పులకు దారి తీస్తోందన్నారు. ఈ పద్ధతిలో రోగుల జన్యుపరమైన, జీవక్రియ సంబంధిత అంశాలను విశ్లేషించి ప్రత్యేకమైన చికిత్సను అందించేందుకు శాస్త్రవేత్తలు ప్రయత్నిస్తున్నారని వెల్లడించారు. జన్యుపరమైన విశ్లేషణ ఆధారంగా క్యాన్సర్ రోగులకు ప్రత్యేకంగా రూపొందించిన ఔషధాలు అందుబాటులోకి వస్తున్నాయని, దీనివల్ల సాంప్రదాయ కీమోథెరపీ వల్ల కలిగే దుష్ప్రభావాలు తగ్గిపోతాయన్నారు. అనంతరం ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్లో ఇన్నోవేటివ్ టెక్నాలజీస్ ఇన్ డ్రగ్ డిస్కవరీ అండ్ డెవలప్మెంట్, ఫార్మాకో జీనోమిక్స్ అండ్ ప్రెసిషన్ థెరపాటిక్స్, నానోటెక్నాలజీ అండ్ టార్గెటెడ్ డ్రగ్ డెలివరీ సిస్టమ్స్, కంప్యుటేషనల్ టూల్స్ అండ్ ఏఐ ఇన్ పర్సనలైజ్డ్ డ్రగ్ డిజైన్, ఎమర్జింగ్ ట్రెండ్స్ ఇన్ క్లినికల్ ట్రయల్ డిజైన్స్ ఫర్ ప్రెసిషన్ థెరపాటిక్స్, రోల్ ఆఫ్ ఫార్మాస్యూటికల్స్ ఇన్ టార్గెటెడ్ థెరపీ అనే అంశాలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. కార్యక్రమంలో ఏపీ ఫార్మసీ కౌన్సిల్ మెంబర్, న్యూఢిల్లీలోని పీసీఐ సెంట్రల్ కౌన్సిల్ మెంబర్ డాక్టర్ ఎస్.ఎల్.ఎన్ ప్రసాద్ రెడ్డి, ఏపీ ఫార్మసీ కౌన్సిల్ రిజిస్ట్రార్ డాక్టర్ ఎం.విల్లియం కారే, విజ్ఞాన్స్ విద్యాసంస్థల చైర్మన్ డాక్టర్ లావు రత్తయ్య, విజ్ఞాన్ ఫార్మసీ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ పీ.శ్రీనివాస బాబు, ఆయా విభాగాల డీన్లు, అధిపతులు, కన్వీనర్లు, అధ్యాపక సిబ్బంది పాల్గొన్నారు.