విజ్ఞాన్స్ వర్సిటీ సీఈవోగా డాక్టర్ కూరపాటి మేఘన బాధ్యతలు స్వీకరణ
చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్స్ యూనివర్సిటీ సీఈవో ( చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్)గా డాక్టర్ కూరపాటి మేఘన సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బాధ్యతల స్వీకరణ కార్యక్రమానికి విజ్ఞాన్స్ విద్యాసంస్థల చైర్మన్ డాక్టర్ లావు రత్తయ్య, వర్సిటీ వైస్ చాన్స్లర్ కల్నల్, ప్రొఫెసర్ పీ.నాగభూషణ్, రిజిస్ట్రార్ డాక్టర్ ఎంఎస్ రఘునాథన్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. అనంతరం విజ్ఞాన్స్ విద్యాసంస్థల చైర్మన్ డాక్టర్ లావు రత్తయ్య మాట్లాడుతూ డాక్టర్ కూరపాటి మేఘన గడిచిన 10 సంవత్సరాల నుంచి కంటి స్పెషలిస్ట్ డాక్టర్గా బాధ్యతలు నిర్వహిస్తూ మంచి పేరు సాధించుకున్నారని తెలియజేసారు. ఇక నుంచి విజ్ఞాన్స్ యూనివర్సిటీ సీఈవోగా తన బాధ్యతలను చక్కగా నిర్వహించి యూనివర్సిటీను మరింత ముందుకు తీసుకువెళ్లాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా డాక్టర్ కూరపాటి మేఘన మాట్లాడుతూ సీఈవోగా బాధ్యతలు స్వీకరించడం ద్వారా తనపై మరింత బాధ్యత పెరిగిందన్నారు. యూనివర్సిటీలోని అన్ని విభాగాలను సమన్వయం చేసుకుని సమర్ధవంతంగా పనిచేయడానికి కృషి చేస్తానన్నారు. యూనివర్సిటీ నియమ నిబంధనలు, నైతిక విలువలు పాటిస్తూ వర్సిటీను మరింత ఉన్నత స్థానాలకు తీసుకువెళ్తానన్నారు. యూనివర్సిటీను జాతీయ – అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందేలా అభివృద్ధి చేస్తానన్నారు. విద్యార్థుల కోసం నూతన పథకాలు రూపొందించడం, సౌకర్యాలను మెరుగుపరచడానికి మరింత కృషి చేస్తానన్నారు. అనంతరం విజ్ఞాన్స్ యూనివర్సిటీలోని ఆయా విభాగాల డీన్లు, అధిపతులు, అధ్యాపక సిబ్బంది, అధ్యాపకేతర సిబ్బందితో సమావేశమయ్యారు.