రేపటి నుంచి విజ్ఞాన్ మహోత్సవ్
- మూడు రోజుల పాటు అలరించనున్న జాతీయ స్థాయి వేడుకలు
- సందడి చేయనున్న సినీతారలు
- ఆయా రాష్ట్రాల నుంచి 50 వేల మంది విద్యార్థులు రాక
చేబ్రోలు మండలం వడ్లమూడిలోని విజ్ఞాన్స్ యూనివర్సిటీ ప్రతిష్టాత్మకంగా నిర్వహించే జాతీయ స్థాయి విజ్ఞాన్ మహోత్సవ్ 18వ ఎడిషన్కు ఏర్పాట్లు పూర్తయ్యాయని వర్సిటీ వైస్ చాన్స్లర్ కల్నల్, ప్రొఫెసర్ పీ.నాగభూషణ్ బుధవారం తెలిపారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వైస్ చాన్స్లర్ మాట్లాడుతూ 18వ ఎడిషన్ విజ్ఞాన్ మహోత్సవ్ కార్యక్రమాన్ని నేటి నుంచి మూడు రోజుల పాటు అత్యంత వైభవంగా నిర్వహించనున్నామని పేర్కొన్నారు. జాతీయస్థాయిలో ప్రతి ఏటా విజ్ఞాన్ మహోత్సవాన్ని నిర్వహిస్తున్నామని తెలిపారు. నేటి కార్యక్రమానికి ముఖ్య అతిథిలుగా ఇండియన్ సింగర్, మ్యూజిక్ కంపోజర్ డాక్టర్ సాలూరి కోటేశ్వరరావు ( కోటి), ఇండియన్ మ్యూజిక్ కంపోజర్ అండ్ ప్లేబాక్ సింగర్ ఎస్.ఎస్.థమన్, గౌరవ అతిథిగా మాజీ ఇండియన్ వాలీబాల్ ప్లేయర్ మన్యం తులసి రెడ్డి హాజరవుతారని వెల్లడించారు. రెండో రోజు కార్యక్రమానికి ఇండియన్ యాక్టర్, డైరక్టర్, స్క్రీన్ రైటర్, హీరో విశ్వక్ సేన్, హీరోయిన్ ఆకాంక్ష శర్మ, యాక్టర్ అభిమన్యు సింగ్ విచ్చేస్తున్నారని పేర్కొన్నారు. చివరి రోజు జరిగే ముగింపు కార్యక్రమానికి ఇండియన్ ఫిల్మ్ డైరక్టర్, స్క్రీన్ రైటర్ కే.ఎస్.రవీంద్ర (బాబీ), 2024 పారాలింపిక్స్ బ్రాంజ్ మెడలిస్ట్, ఇండియన్ పారా పిస్టల్ షూటర్, అర్జున అవార్డీ రుబినా ప్రాన్సిస్ రానున్నారని తెలియజేసారు. విజ్ఞాన్ మహోత్సవ్లో పాల్గొనేందుకు దేశవ్యాప్తంగా ఆయా రాష్ట్రాల నుంచి 50వేల మంది విద్యార్థులు తరలి రానున్నారని వెల్లడించారు. విజ్ఞాన్ మహోత్సవ్ పోటీల విజేతలకు రూ.15 లక్షలకు పైగా బహుమతులను అందజేస్తామని తెలిపారు.
80 ఈవెంట్ల నిర్వహణ
విజ్ఞాన్స్ యూనివర్సిటీ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న మహోత్సవ్లో మొత్తం 80 ఈవెంట్లను నిర్వహించనున్నారు. తొలుత నిర్వహించే స్పోర్ట్స్ ఫీట్లో వాలీబాల్, బాస్కెట్బాల్, కబడ్డీ, టేబుల్ టెన్నిస్, చెస్, అథ్లెటిక్స్, త్రోబాల్, ఫుట్బాల్, హాకీ, తైక్వాండో, ఖోఖో, ట్రాక్ అండ్ ఫీల్డ్ ఈవెంట్స్, యోగాసన వంటి తదితర క్రీడాంశాల్లో జాతీయస్థాయిలో విద్యార్థులకు పోటీలు ఉంటాయని చెప్పారు. వీటితోపాటు మ్యూజిక్, లిటెరరీ, స్పాట్లైట్, డాన్స్, డ్రమాటిక్స్ అండ్ ఫిల్మ్ మేకింగ్, ఫ్యాషన్, ఫైన్ ఆర్ట్స్, కల్చరల్స్, థియేటర్ ఆర్ట్స్ వంటి తదితర రంగాలను కలుపుకుని సాంకేతిక, సాంస్కృతికాంశాల్లో జాతీయస్థాయిలో పోటీలు ఉంటాయని వివరించారు. దేశవ్యాప్తంగా విద్యార్థులంతా ఈ అవకాశాన్ని పూర్తిస్థాయిలో వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో విజ్ఞాన్స్ విద్యా సంస్థల చైర్మన్ డాక్టర్ లావు రత్తయ్య, సీఈవో డాక్టర్ మేఘన కూరపాటి ( ఎమ్మెస్, ఎఫ్.పీ.ఓఎస్), వైస్ చాన్స్లర్ కల్నల్, ప్రొఫెసర్ పీ.నాగభూషణ్, రిజిస్ట్రార్ డాక్టర్ ఎంఎస్ రఘునాథన్, ఆయా విభాగాల డీన్లు, అధిపతులు పాల్గొన్నారు.