మహిళల్లోనే వైవిధ్యమైన నాయకత్వ లక్షణాలు
బెంగళూరులోని ఇస్రో హెచ్క్యూ డెప్యూటీ డైరెక్టర్ నిరుపమ తివారి
విజ్ఞాన్స్ యూనివర్సిటీలో ఘనంగా ఇంటర్నేషనల్ మహిళా దినోత్సవ వేడుకలు
మహిళల్లోనే వైవిధ్యమైన నాయకత్వ లక్షణాలు ఉంటాయని ఇస్రో హెచ్క్యూ డెప్యూటీ డైరెక్టర్ నిరుపమ తివారి అన్నారు. చేబ్రోలు మండలం వడ్లమూడిలోని విజ్ఞాన్స్ యూనివర్సిటీలో శనివారం ఉమెన్ ఎంపవర్మెంట్ అండ్ డెవలప్మెంట్ సెల్ ఆధ్వర్యంలో ఇంటర్నేషనల్ మహిళా దినోత్సవాన్ని శనివారం ఘనంగా నిర్వహించారు. ముందుగా జ్యోతి ప్రజ్వలన నిర్వహించి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ ఏడాది మహిళా దినోత్సవ వేడుకలను ‘‘యాక్సలరేట్ యాక్షన్’’ అనే ఇతివృత్తంతో నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన బెంగళూరులోని ఇస్రో హెచ్క్యూ డెప్యూటీ డైరెక్టర్ నిరుపమ తివారి మాట్లాడుతూ ప్రతి రంగంలో మహిళలు నడుపుతున్న విప్లవాత్మక మార్పులు మరియు వారి ప్రతిభను ప్రజలకు తెలియజేయడం ఈ ఉత్సవాల ప్రధాన లక్ష్యమన్నారు. విద్య, ఆరోగ్యం, విజ్ఞానం, మరియు అన్ని రంగాల్లో మహిళలకు అవగాహన పెంచడానికి అంకితమైన ఈ కార్యక్రమాలు మహిళల ప్రతిభను ప్రపంచానికి అందించడం లక్ష్యంగా ఉంటాయన్నారు.
కార్యక్రమానికి మరో ముఖ్య అతిథిగా హాజరైన రిపబ్లిక్ ఆఫ్ జింబాబ్వే ప్రెసిడెన్షియల్ అండ్ నేషనల్ స్కాలర్షిప్స్ డిపార్ట్మెంట్ ఆఫీస్ ప్రెసిడెంట్ అండ్ కేబినెట్ చీఫ్ డైరెక్టర్ డాక్టర్ వాడ్జనాని కచేరే మాట్లాడుతూ మహిళలు తమ గమ్యాలను చేరుకోవడంలో పటిష్టమైన చర్యలు తీసుకోవాలని పిలుపునిచ్చారు. ప్రతిపాదనలలో మహిళలు ముందంజలో ఉన్నారని, అనేక విభాగాలలో మహిళలు, ఆంగ్ల విద్య, శాస్త్ర సాంకేతికత, ఆరోగ్యం, సామాజిక సేవ, కళలు మరియు ఇతర రంగాలలో తమ సత్తా చాటుతున్నారని వెల్లడించారు.
కార్యక్రమానికి గౌరవ అతిథిగా హాజరైన నవభారత్ కో–ఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్ డైరెక్టర్ యార్లగడ్డ త్రిపురాంబ మాట్లాడుతూ మహిళలు అవకాశాల కోసం ఎవరి కోసమో ఎదురుచూడొద్దని, విజ్ఞానం, నైపుణ్యం పెంచుకుంటే స్త్రీలు ఏదైనా సాధించొచ్చని పేర్కొన్నారు. ఎందరో మహిళలు దేశ నాయకులుగా చరిత్ర సృష్టిస్తూ, జాతి దశను, దిశను మార్చేస్తున్నారని తెలిపారు. స్త్రీలు స్వతహాగా శక్తి స్వరూపులని తెలియజేసారు.
కార్యక్రమానికి గౌరవ అతిథిగా హాజరైన ఎన్జీవో సోషల్ యాక్టివిస్ట్ రంగనాయకమ్మ మాట్లాడుతూ మహిళలు జీవితంలోను, సమాజంలోని సమస్యలపై గట్టిగా పోరాడాలని తెలిపారు. మహిళలు ఎప్పుడూ కూడా తమ భావోద్వేగాలను అదుపులో ఉంచుకోవాలని పేర్కొన్నారు. తమ బలాలను పెంచుకుంటూ బలహీనతలను అధిగమించాలన్నారు.
అనంతరం మహిళా దినోత్సవం సందర్భంగా నిర్వహించిన పోటీలలో గెలుపొందిన విద్యార్థులకు, అధ్యాపకులకు బహుమతులను అందజేసారు. కార్యక్రమానికి హాజరైన ముఖ్య అతిథులను ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో సీఈవో డాక్టర్ మేఘన కూరపాటి, విజ్ఞాన్స్ యూనివర్సిటీ వైస్ చాన్స్లర్ కల్నల్, ప్రొఫెసర్ పీ.నాగభూషణ్, రిజిస్ట్రార్ డాక్టర్ ఎంఎస్ రఘునాథన్, ఆయా విభాగాల డీన్లు, అధిపతులు, అధ్యాపక సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.